హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2024 కంటే ముందుగా టీచర్ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి, డీఈడీ, బీఈడీ నిరుద్యోగులకు న్యాయంచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగా లేఖ రాశారు.
టెట్ నిర్వహించక పోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతను అనేకమంది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుడు సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. గత డిసెంబర్లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 50 వేల మంది ఉన్నారని వివరించారు.
టెట్ నిర్వహిస్తే ఇందులో అర్హత సాధించిన వారందరూ డీఎస్సీ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డీఈడీ, బీఈడీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.