హైదరాబాద్: టెట్ ఫీజుల పెంపుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం తగదని హితవుపలికారు. సీటెట్తో పోల్చితే టెట్ ఫీజులు రెట్టింపు ఉన్నాయని విమర్శించారు. అధిక ఫీజులకు నిరసనగా బీఈడీ, డీఈడీ వాళ్లు పోరాడుతున్నా, అభ్యర్థులు రోడ్లెక్కి ఉద్యమిస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?.. ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.
‘టెట్ ఫీజులు భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం కలుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీన్నీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఒక పేపర్, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు ఉండేది. ప్రస్తుతం ఒక పేపర్కు రూ.వెయ్యి, రెండు పేపర్లకు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. సీబీఎస్సీ నిర్వహించే సీటెట్తో పోల్చితే డబుల్గా ఉండటం గమనార్హం.
రిజర్వ్డ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా, జనరల్ కేటగిరీ విద్యార్థులతో సమానంగా ఫీజు అమలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. సీటెట్లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్ఈ ఫీజు రాయితీ అమలు చేస్తున్నది. మన రాష్ట్రంలో ఏపీసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల్లోనూ ఫీజుల రాయితీ అమలు చేస్తున్నారు. టెట్లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. ఫీజు రాయితీ కల్పించకపోవడాన్ని నిరసిస్తూ బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పోరాడుతున్నారు. పుస్తకాలు వదిలి రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన’ అని లేఖలో పేర్కొన్నారు.