Harish Rao | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉచిత విద్యుత్ పథకం అమలు విధానంపై మాజీ మంత్రి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. 200 యూనిట్ల లోపు వినియోగిస్తేనే జీరో బిల్లు ఇస్తున్నారు. ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం వసూలు చేస్తున్నారు. 200 యూనిట్ల కంటే ఎక్కువైతే ఆపై యూనిట్లకే బిల్లు వేయాలి. రాష్ట్రంలోని 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఉచిత విద్యుత్ మాత్రం 30 లక్షల మందికే వర్తింపజేస్తున్నారు. హైదరాబాద్లో 10 లక్షల మందికే ఈ పథకం వర్తింజేస్తున్నారు. మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేయాలి అని హరీశ్రావు డిమాండ్ చేశారు.
వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారని హరీశ్రావు ధ్వజమెత్తారు. తానివ్వాల ఫ్యాన్ వేసుకోవాలా? వద్దా? లైట్ వేసుకోవాలా? వద్దా? అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి పేదలను నెట్టడం బాధాకరం. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరుతున్నాను. 200 యూనిట్లు దాటితే, 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హరీశ్రావు కోరారు.
ఇక ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారని హరీశ్రావు తెలిపారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింపచేస్తున్నది. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతున్నాను. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే, మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలి. అలా చేయని పక్షంలో ఈ పథకం కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుంది. హామీల అమలుకు ప్రభుత్వమే తూట్లు పొడిచినట్లు అవుతుందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాము. నిజంగా పేదలకు సాయం చేయాలనే చిత్తశుద్ధి మీకుంటే, వెంటనే పై మూడు విషయాల్లో తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు.
గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంవిషయము : నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అమలు చేసే విషయంలో అర్హులకు జరుగుతున్న అన్యాయం గురించి.
తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి…
— Harish Rao Thanneeru (@BRSHarish) March 5, 2024