హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పుట్టిన పది రోజులకే తల్లిని కోల్పోయిన పసిగుడ్డు.. ఊళ్లో గ్లాసెడు పాలు కూడా దొరకని దైన్యం.. పశు సంపద లేని ఊరు.. పాల ప్యాకెట్ కోసం తండ్రి రోజూ 10 కిలోమీటర్ల ప్రయాణం.. విన్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించే కష్టం. ఆ బిడ్డ ఆకలికి, ఆ తండ్రి వేదనకు మంత్రి తన్నీరు హరీశ్రావు చలించిపోయారు. మానవీయ హృదయంతో స్పందించారు. వెంటనే అధికారులను పంపించి, పాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుమూల ప్రాంతమైన రాజుగూడకు చెందిన కొడప పారుబాయి జనవరి 10న ఇంద్రవెల్లి పీహెచ్సీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పది రోజులకే అనారోగ్యంతో ఆమె కన్నుమూసింది. ఒకవైపు తల్లి లేని పసికందు.. మరోవైపు పోతపాలు దొరకని దయనీయ పరిస్థితి. ఆ తండాలో ఏ ఒక్కరికీ ఆవులు, బర్రెలు, మేకలు లేవు. దీంతో ఆ పసిబిడ్డ ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపురావు పడరాని పాట్లు పాడుతున్నారు. ప్రతి రోజూ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొస్తున్నారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి హరీశ్రావు చలించిపోయారు. ఆ బిడ్డకు తక్షణం సాయం అందించాలని, పాల కొరత లేకుండా ఆ ఇంటికి ఆవును సమకూర్చాలని అధికారులకు సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు గురువారం సమీప పీహెచ్సీ సిబ్బంది రాజుగూడకు వెళ్లారు. తాత్కాలికంగా పాల ప్యాకెట్లు, పౌష్ఠికాహారం ప్యాకెట్లు అందజేశారు. పాప ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. తండ్రి జంగుబాబు కోరిక మేరకు శాశ్వత పరిషారంగా పాలిచ్చే ఆవును కొనుగోలు చేసి అందజేశారు. బిడ్డకు పాలు లేవ నే సమస్య ఉండబోదని భరోసా ఇచ్చారు. ఎలాం టి ఆరోగ్య సమస్యలు ఉన్నా తమకు తెలియజేయాలని సూచించారు. మానవతా హృదయంతో స్పందించి సమస్యను పరిష్కరించినందుకు మంత్రి హరీశ్రావుకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డను బాగా చూసుకుంటామని, ఆవును తమ కుటుంబానికి లభించిన గొప్ప బహుమతిగా భావిస్తామని చెప్పారు. మంత్రి హరీశ్రావు సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం అంటే ఆకలితో ఉన్న బిడ్డకు మంత్రి స్వయంగా జోల పాడినట్టు ఉన్నదని పొగుడుతున్నారు.