కొండాపూర్, జనవరి 16: గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)లో చేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై దవాఖాన యాజమాన్యం బులెటిన్ విడుదల చేస్తూ తమ్మినేనిని వెంటిలేటర్ సాయంతో ద వాఖానకు తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఊపిరితిత్తుల నుంచి నీటిని తొలగించేందుకు డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్టు పేర్కొంది.
గుండెపోటుతో ఏఐజీ దవాఖానలో చేరిన వీరభద్రంను మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంగళవారం పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్నారు. తమ్మినేని వేగంగా కోలుకొని ప్రజాసేవలో ముందుకు సాగాలని హరీశ్రావు ఆకాంక్షించారు.