Harish Rao | ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీక్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చేస్తోందని విమర్శించారు. మొన్నటి పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం ఇంకా మరువకముందే, ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, AI పెన్లతో రాసిన మోడ్రన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోందని అన్నారు. ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రలో మునిగి ఉందని నిలదీశారు.
మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరమని హరీశ్రావు అన్నారు. చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి, రేవంతు రెడ్డి విలువల్లేనితనానికి నిదర్శనమని ఆరోపించారు. మహాకవి శ్రీశ్రీ “కాదేదీ కవితకు అనర్హం” అని చెప్పారు… కానీ రేవంత్ రెడ్డి “కాదేదీ స్కాంకు అనర్హం” అని చెప్పడమే కాకుండా, చేసి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదు, పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతకాదు..ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు.
పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు.