Harish Rao | కాకినాడ పోర్టులో ముక్కిపోతున్న 7500 మెట్రిక్ టన్నుల బియ్యం.. ఎంత నష్టం వచ్చిందో చెప్పాలని హరీశ్రావు డిమాండ్
Harish Rao | ఆర్టీసీకి కొత్త పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బందిని ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలన్నారు.
సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్రావు తెలిపారు. కొత్త బస్సులను తెప్పించాలని కోరితే బస్సులు లేవని అంటున్నారని పేర్కొన్నారు. కొత్తవి లేకుంటే ఉన్న పాత బస్సులనే పునరుద్ధరిస్తారా చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సభను తప్పుదోవ పట్టించారని హరీశ్రావు మండిపడ్డారు. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతిలో స్కాం జరిగిందని ఆరోపించారు. బియ్యం ఎగుమతి చేయడానికి పెట్టుకున్న అడ్వైజర్ ఘరానా మోసగాడు అని విమర్శించారు. ఈడీ, సీబీఐ కేసులో నమోదైన వ్యక్తిని అడ్వైజర్గా పెట్టుకున్నది నిజామా కాదా అని ప్రశ్నించారు. ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది నిజం కాదా అని నిలదీశారు. పది లక్షల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తాం అని ఎంవోయూ చేసుకున్నాం అని, ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అని, మా విజయం అని గొప్పలు చెప్పుకున్నారు.. ఇప్పుడు ఇదే పెద్ద స్కాంగా మారిందని అన్నారు.
లక్ష మెట్రిక్ టన్నులు పిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తామని ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు. నాఫెడ్ అనే సంస్థ కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే డబ్బులు చెల్లిస్తామని అంటే.. ఆ సంస్థకు కాకుండా ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 27,500 మెట్రిక్ టన్నుల వద్దనే ఎందుకు ఆగిపోయారని ప్రశ్నించారు. మరో 7500 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్టులో ముక్కిపోతున్నాయని తెలిపారు. 7500 మెట్రిక్ టన్నులు ఏడాదిగా పోర్టులో ఉంటే గోదాం, హ్యాండ్లింగ్ చార్జీల భారం పడవా అని ప్రశ్నించారు. ఆ 7500 మెట్రిక్ టన్నుల బియ్యం ముక్కిపోయాయా? పురుగులు పడ్డాయా అని అడిగారు. వాటాలు తేలకపోవడమే ఎగుమతి ఆగిపోవడానికి కారణం కాదా అని ప్రశ్నించారు.
ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతిలో స్కాం జరిగింది
సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్ పెట్టుకున్నది నిజం కాదా?
ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది నిజం కాదా?
పది లక్షల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్కు ఎగుమతి… pic.twitter.com/OLUn3mVYyd
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2026
రాష్ట్ర ప్రభుత్వం తీరుతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నది వాస్తవమని హరీశ్రావు అన్నారు. నిజాయితీ ఉంటే హౌస్ కమిటీ వేయండి.. నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో ముక్కిపోయిన బియ్యంతో ఎంతమేరకు నష్టం వాటిల్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్వాన్స్ డబ్బులు ఇస్తామని కేంద్ర సంస్థ కోరితే ఇవ్వకుండా ఓ ప్రైవేటు సంస్థకు ఏవిధంగా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో హౌస్ కమిటీ వేయాలని కోరారు. యాసంగికి బోనస్ ఎప్పుడు చెల్లిస్తారో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం లేదని హరీశ్రావు విమర్శించారు.