హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయని, జలాశయాల్లో నీళ్లు లేక, వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్రావు (Harish Rao) అన్నారు. పంటలు వేయాలా? వద్దా అనే అయోమయంలో రైలు ఉన్నారని చెప్పాడు. మిడ్మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. గతేడాది ఆగస్టులో ఆయా జలాశయాల్లో నీరు నిల్వ ఉన్నదని పేర్కొన్నారు. ‘సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్లో 3.32 టీఎంసీల నీళ్లు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.38 టీఎంసీలకుగాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్నసాగర్లో 18 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్లో 10 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను.’ అని లేఖలో పేర్కొన్నారు.