కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులపై గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తెలంగాణ జాతిపిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్పై రాజకీయ కక్షతో రేవంత్రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్ద కాలంపాటు తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు.
అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమే అవుతుందని స్పష్టంచేశారు. పరిపాలనలో చేతకానితనం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించడం రేవంత్రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం అని మండిపడ్డారు.