హైదరాబాద్: కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే.. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాంటి నిర్బంధాలు, నిరంకుశత్వం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్ల ముందు పోలీస్ పికెట్ల గురించి ఏనాడైనా విన్నామా అని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిర్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నాడని, దుర్భాషా దురంధరుడు అని బిరుదు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జిషీట్. ప్రజలు, ప్రజా సమస్యలు, ఆరు గ్యారంటీల అమలుపై చార్జిషీట్. కాంగ్రెస్ ఏడాది పాలన ప్రజా పీడిత పాలన. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్యం అపహాస్యంగా మారింది. తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాంటి నిర్బంధాలు, నిరంకుశత్వం చూడలేదు. స్కూళ్ల ముందు పోలీస్ పికెట్ల గురించి ఏనాడైనా విన్నామా?. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. మీడియా, సోషల్ మీడియాలపై ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ నాయులు, ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు. గిరిజన బిడ్డల మీద లాఠీచార్జి చేశారు. తిట్లు, ఒట్లు, పోట్లు ఇదే రేవంత్ పాలన. పోలీసులతోనే పోలీసు కుటుంబాలను కొట్టించారు. ప్రతికూల దృక్పథంతో రేవంత్ పాలన ప్రారంభమైంది. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ఢమాలైంది. 6 గ్యారంటీలు, 420 హమీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. సీఎం ఛాంబర్కు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. దేశంలోనే రేవంత్ ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం నవ్వులపాలైంది. పదేండ్ల కేసీఆర్ పాలన ఎట్లుండె.. ఏడాది కాంగ్రెస్ పాలన ఎట్లుంది?. రూ.60 కోట్లున్న రాష్ట్ర బడ్జెట్ను రూ.3 లక్షల కోట్లకు కేసీఆర్ పంచారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోలు, రైతులు రోడ్డెక్కారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజీ అయింది. ఖమ్మం, మహబూబాబాద్ వరద సహాయక చర్యల్లోనూ ఘోరంగా విఫలమైంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాలేదు. వరదల్లో చిక్కుకున్న 8 మంది తమను తాము రక్షించుకున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై రాళ్ల దాడి చేశారు. శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం. రాష్ట్రంలో ఆందోళనలు, అలజలు పెరిగిపోయాయి. ముసలోళ్ల నెల పింఛను గుంజుకున్న మదునష్టపు సర్కార్ ఈ కాంగ్రెస్. బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు కొట్టుకుంటున్నారు. రేవంత్ అసమర్థ పాలనతో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విఫలమైంది. గచ్చిబౌలి-శంషాబాద్ మెట్రో రైలు రద్దు చేశారు.
విద్యాభరోసా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4.26 లక్షల కోట్లు అప్పుచేస్తే.. రేవంత్ సర్కార్ ఏడాదిలోనే రూ.లక్ష కోట్లు అప్పు చేసింది. కాళేశ్వరం నీళ్లు లేకుండానే కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అబద్ధాలు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంటనే ఎలా పండింది?. కేసీఆర్ హయాంలో వరి పంట కోటీ 60 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. కేసీఆర్ ఏమీ చేయకుండానే కోటి మెట్రిక్ టన్నుల పంట పెరిగిందా?. కాళేశ్వరం ప్రాజెక్టు సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. మిషన్ కాకతీయలో భాగంగా వేలాది చెరువులు బాగుచేశాం. వేలాది చెక్డ్యాములు నిర్మించి నీళ్లు అందించాం. ఏడాదికి 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఏడాదిలో 6,500 ఎకరాలైనా కొత్త ఆయకట్టు వచ్చిందా?. పాలమూరు బిడ్డనని చెప్పుకునే నైతిక అర్హత రేవంత్రెడ్డికి లేదు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది.
అన్ని పంటలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బోనస్ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడేమో సన్నవడ్లకే బోనస్ మాటమార్చారు. మద్దతు ధరకంటే తక్కువకే రైతులు ధాన్యం అమ్ముకున్నారు. రైతుల ధాన్యం సగం దళారుల పాలైంది. వ్యవసాయ డిక్లరేషన్లోని 9 హమీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని మోసం చేశారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని మోసం చేశారు. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ మోసం చేశాడు. నిరుద్యోగుల రెక్కలు విరిచి, డొక్కలో గుద్దించిండు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ అపాయింట్మెంట్స్ ఇచ్చాడు. నిరుద్యోగ భృతి నెలకు రూ.4 వేలు ఇస్తామని మోసం చేశారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబులు లేవు. అశోక్ నగర్లో నిరుద్యోగులపై రేవంత్ లాఠీచార్జ్లు చేయించాడు. రేవంత్ పాలనలో గురుకులాలకు గ్రహణం పట్టింది. పురుగుల అన్నం, గొడ్డుకాలం తినలేకపోతున్నామని విద్యార్థుల ఆందోళనలు. పాముకాట్లు, అనారోగ్యంతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ మరణాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
కేసీఆర్ హయాంలో క్రమం తప్పుకుండా పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి నిధులు ఇచ్చేది. రేవంత్ పాలనలో పల్లెలకు నిధులు రాక మురికి కూపాలుగా మారాయి. హరితహారంలో నాటిని మొక్కలకు నీళ్లు పోసే దిక్కులేదు. హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూల్చారు. ఇంట్లో ఉన్న పుస్తకాలు తెచ్చుకుంటానని ఓ చిన్నారి అడిగినా కనికరించలేదు. ప్రజలు తిరగబడితే ఇక ఇండ్లు కూలగొట్టమని అంటున్నారు. కూలగొట్టిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు?. మూసీ పేరిట రేవంత్రెడ్డి లంకెబిందెలు వెతుకుతున్నారు. మూసీ ప్రక్షాళన అనేది మురికి నీళ్లు వచ్చే చోట ప్రారంభించాలి. రేవంత్ మాత్రం ఇండ్ల కూల్చివేతతో ప్రారంభించాడు. భూములు స్వాధీనం చేసుకుని తన అనుయాయులకు కట్టబెట్టు కుట్రలు చేస్తున్నాడు. రూ.16 వేల కోట్లతో ప్రక్షాళన పూర్తయ్యేదానికి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు?. రేవంత్ ఏడాది పాలనపై మూసీ బాధితులు ఏడు దోసిళ్ల మన్ను పోస్తున్నారు.
ఊసరవెల్లిలా రంగులు మార్చే రేవంతూ.. లగచర్ల గిరిజన రైతుల దెబ్బకు జడిసి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నడు. రేవంతఃకి నిజంగా ఉపాధి కల్పనపై చిత్తశుద్ది ఉంటే.. మా కేటీఆర్ చెప్పినట్టుగా కల్వకుర్తిలో నీకున్న 500 ఎకరాల భూమి ఇవ్వు. కాంగ్రెస్ వస్తే 14 వేల ఎకరాల ఫార్మాసిటీ భూములను రైతులకు తిరిగి ఇస్తానన్నాడు. ఇప్పుడేమో రైతుల నుంచి 30 వేల ఎకరాలు తీసుకుంటానంటున్నడు. రేవంత్ రెడ్డికి ఉన్న 500 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కుకు ఇవ్వాలి. రేవంత్ తన వైఫల్యాలను ప్రతిపక్షాలపైకి నెడుతున్నాడు. నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్టు అజ్ఞానంగా వ్యవహరిస్తున్నడు. హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలున్నాయని రేవంత్ అన్నాడు. బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందన్నాడు. మల్లన్నసాగర్లో 14 వేల ఎకరాలు నీట మునిగితే 50 వేల ఎకరాలన్నాడు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు కట్టలేదని బొంకాడు.
రేవంత్రెడ్డికి దుర్భాషా దురంధరుడు అని బిరుదు ఇవ్వాలి. రేవంత్ ఉన్మాదిలా బూతు మాటలతో రెచ్చిపోతున్నడు. రేవంత్ మాటలు వింటే చిన్న పిల్లలు చెడిపోతారని టీవీలు బంద్చేస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన తెలంగాణ ప్రజలను హతాశుల్ని చేసింది. పదేండ్లలో కేసీఆర్ పెంచిన బ్రాండ్ ఇమేజ్ను రేవంత్ దిగజార్చాడు. రేవంత్ తన పరువు తీసుకోవడమే కాకుండా రాష్ట్ర పరువు తీస్తున్నాడు. ఏడాది రేవంత్ పాలన తెలంగాణకు తీరని వేదన మిగిల్చింది. ఏడాదిలో తాము ఏం కోల్పోయామో రాష్ట్ర ప్రజలకు తెలిసొచ్చింది.’ అని హరీశ్ రావు అన్నారు.