హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): 24 గంటల ఉచిత విద్యుత్తుపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి రెఫరెండానికి సిద్ధమా? అని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ వద్దన్నవాళ్లకు, పార్టీలకు తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి కట్టారని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఇలా ఎంతోమంది శాస్త్రీయంగా చెప్తున్నా ఎకరానికి గంట కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ఒక తప్పును ఒప్పుకుంటే పోయేదానికి కాంగ్రెస్ వంద తప్పులు చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఆందోళనలు, ఉద్యమాలు జరిగేవని, బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో విద్యుత్తు కోసం ఏనాడైనా అలాంటి ఆందోళనలు జరిగాయా? అని ప్రశ్నించారు. కరెంట్ సమస్య ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో అసెంబ్లీలో మొదటి వాయిదా తీర్మానమే కరెం ట్ కోతలు.. ఎండిపోతున్న పంటలు అన్న వాస్తవాన్ని మరిచిపోయారా? అని నిప్పులు చెరిగారు. నాడు కరెంట్ అతిపెద్ద సమస్య అని, నేడు ఆ సమస్యనే లేకుండా చేసిన గొప్ప నేత కేసీఆర్ అని స్పష్టం చేశారు. రేవంత్కు అసలు పీసీసీ అధ్యక్షుడికి ఉండాల్సిన అవగాహన ఏమైనా ఉందా? అని మండిపడ్డారు.
డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో ఇప్పటికీ ఆయిల్ ఇంజిన్లు నడుస్తున్నయ్. దేశంలో రైతులకి ఇంత నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.
గతంలోనూ ఉచిత విద్యుత్తు వద్దన్నవాళ్లకు తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి కట్టారని హరీశ్రావు గుర్తుచేశారు. ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని, ఉచిత కరెంట్ సాధ్యం కాదని మాట్లాడిన చంద్రబాబుకు, టీడీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే దారిలో వెళ్తున్నదని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమన్నారు. కాంగ్రెస్కు కూడా తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగం మూడు పంటలు పండించాలని రాత్రింబవళ్లు పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్ర, రైతాంగం మేలు కోసం ఎవరైతే బాగుంటదో ప్రజలే ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అస్తలేదని, కరెంట్ అవసరం లేదని మాట్లాడేటోళ్లు ఓసారి సక్కగా పొయ్యి కరెంట్ తీగలైనా పట్టుకోండి. లేదా కరెంట్ పొక్కల్లో వేలైనా పెట్టండి. అప్పుడు తెలుస్తుంది కరెంట్ ముచ్చట.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్ అమలవుతున్నదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో తెలంగాణలా 24 గంటల ఉచిత విద్యుత్తు కావాలనే డిమాండ్ వస్తున్నదని, ఆ ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఆ డిమాండ్ మింగుడు పడని నేపథ్యంలోనే తెలంగాణలోనూ 24 గంటల కరెం ట్ ఇయ్యకుంట చేయాలనే కుట్రలో భాగమే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు అని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో 24 గం టల ఉచిత కరెంట్ ఇచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ వస్తుంటే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కిరణ్కుమార్రెడ్డి సీఎం హోదాలో ‘మేము ఏడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేం. నాలుగైదు గంటల కరెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు’ అని పేర్కొన్న ఉదంతాన్ని గుర్తుచేశారు. ‘పంట కరెంట్కు సర్కారు స్విచ్చాఫ్’ అనే శీర్షికతో వెలువడ్డ వార్తా కథనాలు, కార్టూన్లే సాక్ష్యమని తెలిపారు.
డిప్యూటీ స్పీకర్, కేంద్రమంత్రి పదవులను గడ్డిపోచలా వదిలేసిన నేత కేసీఆర్.. పదవులకోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చేవారు మీరు (కాంగ్రెస్ నాయకులు).
ఇతర రాష్ర్టాలకు విద్యుత్తు ఓ అవసరం అయితే.. తెలంగాణకు కరెంట్ ప్రాణాధారం అని హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా అనేక రాష్ర్టాల్లో ప్రభుత్వాలు కరెంట్ ఇయ్యలేక ఆయిల్ ఇంజిన్లతో నడిపిస్తున్నారని ఎద్దేవాచేశారు. అదే తెలంగాణలో పల్లెపల్లెకూ త్రీ ఫేజ్ కరెంట్ ఉన్నదని చెప్పారు. గిరిజన ఆవాసాలకూ సీఎం కేసీఆర్ రూ. 250 కోట్లు ఖర్చుచేసి త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చారని గుర్తుచేశారు. మారుమూల కోయ, గోండు గూడేలు, లంబాడీ తండాలకు కూడా త్రీ ఫేజ్ కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. గిరిజనులకు ఇప్పుడు పంపిణీ చేస్తున్న నాలుగు లక్షల పోడు భూములకు కూడా కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఇది రైతుల పట్ల తమకున్న కమిట్మెంట్కు నిదర్శనం అని తేల్చిచెప్పారు.
‘కరెంట్పై కాంగ్రెస్ విధానం మూడు గంటలు.. కేసీఆర్ నినాదం మూడు పంటలు.. బీజేపీ నినాదం మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ సమాజం తేల్చుకోవాలి.
ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ది వ్యాపార ధోరణి అయితే.. సీఎం కేసీఆర్ది మానవీయ కోణమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘తెలంగాణ రైతు బతకాలె. తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో ఉండాలె. రైతు బతుకుల్లో మార్పు రావాలె’ అన్నదే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ విధానమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా 8.10 లక్షల వ్యవసాయ ఉచిత విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ వైండింగ్ దుకాణాలు, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసే దుకాణాలు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లను ఉత్పత్తి చేసే దుకాణాలు మాయం అయ్యాయని అన్నారు. హైటెక్ సిటీ హైదరాబాద్లో ఎలాంటి కరెంట్ వస్తుందో.. మారుమూల పల్లెలోని రైతుకు కూడా అటువంటి కరెంటే రావాలని కేసీఆర్ పట్టుబట్టడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు 9 ఏండ్లలో రూ.37 వేల కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఆలోచించటం తప్పా?అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఆ పార్టీకి కరెంట్పై మాట్లాడే నైతిక హక్కులేదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు భేషరతుగా రైతులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని, ముక్కునేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని వివరించారు. ఇప్పుడిప్పుడు కుదుటపడుతున్న రైతులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు పిడుగుపాటు వంటివని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నదని మండిపడ్డారు.
రైతుల మోటర్లకు మీటర్లు పెడతామని కాంగ్రెస్ నేతలు పేర్కొనడాన్ని మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర శాసనసభ సాక్షిగా ‘నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టను. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతా’ అని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రైతుల కోసం రూ.35 వేల కోట్ల నష్టం వచ్చినా ఫర్వాలేదు అని సీఎం కేసీఆర్ భావించి.. 65 లక్షల మంది రైతుల భవిష్యత్తే తమకు ముఖ్యమని స్పష్టంగా చెప్పారని తెలిపారు. రైతుల మోటర్లకు మీటర్లు పెడితే రూ. 35వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసిందని, వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే ఏడాదికి 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం ఎక్కువ ఇస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు. రూ.35వేల కోట్ల నగదా? 65 లక్షల మంది రైతులా భవిష్యత్తా?అంటే తాము రైతుల భవిష్యత్తే ముఖ్యమని భావించామని ఆయన తేల్చిచెప్పారు. రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా బట్టకాల్చి మీదేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ మానుకోవాలని ఆయన హితవు చెప్పారు.
ఆనాడు చంద్రబాబు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి సీఎం స్థానంలో ఉన్న బాబుకు డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ లేఖ రాశారు. విద్యుత్తు చార్జీలు తగ్గించకుంటే రైతుల పక్షాన పోరాడుతామని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ నేతలు రైతులకు 3 గంటల కరెం ట్ చాలని మాట్లాడి కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారని హరీశ్రావు ఎద్దేవా చేశా రు. కాంగ్రెస్ తాను చేసిన తప్పు నుంచి బయటకు వచ్చేందుకు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. 3 గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వ్యాఖ్యానించారని, ఉచిత కరెంట్కు తమ సోనియాగాంధీ వ్యతిరేకమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుజాత చెప్పారని, వ్యవసాయానికి 8 గంటలు చాలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బోరుబావులకు మీటర్లు పెడతామని మరో అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారని హరీశ్రావు తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ తన విధానాన్ని ప్రకటించిందని అన్నారు. రైతు వ్యతిరేక వైఖరిని, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ తనకున్న వ్యతిరేక అభిప్రాయాన్ని ప్రకటించి ప్రజాగ్రహానికి గురైందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేస్తుంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టు ఆ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యుత్తు విషయంలో సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.
బషీర్బాగ్ కాల్పులకు కేసీఆరే కారణమని మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల తీరుపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులోంచి అని తేల్చిచెప్పా రు. చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. 2000 ఆగస్టు 28న బషీర్బాగ్ కాల్పులు జరిగితే.. అదే రోజు డిప్యూటీ స్పీకర్గా రైతు హృదయంతో స్పందించింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ప్రభుత్వంలో, అధికార పార్టీలో ఉండి రైతులపై చంద్రబాబు కాల్పులు జరిపిస్తే.. ‘పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించండి, ఈ చార్జీలు తెలంగాణ సమాజానికి గుదిబండగా మారుతాయి. తెలంగాణలో వ్యవసాయం ఖతమైపోతది. చార్జీలు తగ్గించకపోతే పోరాటం చేస్తాం’ అని బాబును కేసీఆర్ హెచ్చరిస్తూ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి కేసీఆర్ను పట్టుకొని ఇష్టమొచ్చినట్టు పిచ్చికూతలు కూస్తున్న నేతలవి నాలికలా? లేక తాటి మట్టలా? అని నిప్పులు చెరిగారు.
ఉచిత కరెంట్పై రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తప్పుపడితే చంపేస్తామని బెదిరింపులకు దిగారని హరీశ్రావు మండిపడ్డారు. కాల్డేటా ఆధారంగా వారందరి వివరాలు సేకరించామని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాకే ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండా రాజ్యం నడుపదలుచుకున్నదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్తం పార్టీ గుండాల చేతుల్లోకి పోయిందా? అని నిప్పులు చెరిగారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం అని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దాసోజు శ్రవణ్కు బెదిరింపు కాల్స్ చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. పదవులు ముఖ్యమా? ప్రజాస్వామ్యం ముఖ్యమా తేల్చుకోవాలని ఆయన కాంగ్రెస్ నేతలను నిలదీశారు.