సిద్దిపేట: కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయపటపడిందని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంతో ఇరు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైదని విమర్శించారు. బీజేపీ అజెండా మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా గవర్నర్ తమిళిసై పనిచేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను పార్టీల్లో ఉన్నారంటూ ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడిని సిఫారసు చేస్తే ఆమోదించారని తెలిపారు. ఇది ద్వంద్వ నీతి కాదా, కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించడం కాదా అని ప్రశ్నించారు.
గతంలో క్రీడా, సాంస్కృతిక, విద్యా, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు రాజకీయ కారణాలతో ఆమెదించలేదు. ఇప్పుడు ఎందుకు ఆమెదించారని వెల్లడించారు. న్యాయసూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకేరకంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ గవర్నర్ తేడా చూపిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కుట్రలో గవర్నర్ భాగస్వామి కావడం దురదృష్టకరమని చెప్పారు.