హైదరాబాద్: రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతోని, అక్రమ కేసులతో, అరెస్టులతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోని.. తమను మానసికంగా బలహీన పరుస్తున్నానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ కాని తాము మరింత బలంగా పోరాడుతాము తప్ప, మీ అక్రమాలపై, ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించడం మాత్రం ఆపేది లేదని చెప్పారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద పార్టీ నేతలతో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసు నమోదుచేసిందని రాష్ట్ర ప్రజలకు తెలుసున్నారు. రైతుబంధు విషయంలో వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి, యాసంగి పంటకు కూడా రూ.15 వేలు కాకుండా రూ.6 వేలు మాత్రమే ఇస్తామని చెప్పి రేవంత్ ప్రభుత్వం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని చెప్పారు. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్టుల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, రేవంత్ ఫెయిల్యూర్ సీఎం అని తేలింది. దీంతో కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టి, ప్రజల దృష్టిని మరల్చాలని రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు.
‘రేవంత్ రెడ్డి అరెస్టయి జైల్లో పడడానికి ఈ కేసుకి పొంతనలేదు. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయాడు. కేటీఆర్ మాత్రం తెలంగాణ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఈమేజి కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం అంటే మోకాలికి.. బోడి గుండుకి ముడి వేయడమే. ఎన్ని రకాల కేసులు పెట్టిన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వెనక్కి వెళ్లం. ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతాం. అక్రమ కేసులతోనూ, అరెస్టులతోనూ మమ్మల్ని బలహీనపరచాలన్న రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదు. ఎన్ని రకాల కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం.
ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు. కేసులో అవినీతి ఉందని శిక్ష వేసిన తీర్పు కాదు. ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు.. విచారణ చేసుకోమని కోర్టు చెప్పింది. గతంలో కూడా కేటీఆర్ విచారణకు సిద్ధమని చెప్పారు. ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే అంశంపై మా లీగల్ సెల్ నిర్ణయిస్తుంది. హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత లీగల్ సెల్ సలహా మేరకు తదుపరి కార్యాచరణ చేపడతాం. నిన్న ఏసీబీ దగ్గరికి కూడా విచారణ ఎదుర్కోవడానికి కేటీఆర్ వెళ్లారు. 9వ తేదీన కూడా ఇచ్చిన నోటీసు మేరకు విచారణకు వెళ్తారు. నిన్న కూడా 45 నిమిషాలు ఆపినా కేటీఆర్ ఓపిగ్గా వేచి చూశారు. కచ్చితంగా విచారణను ఎదుర్కొంటాం.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసమే కేటీఆర్ ఫార్ములా-ఈ ని హైదరాబాద్కి తెచ్చారు. ఇదే రేసును తమ రాష్ట్రాలకు నగరాలకు తీసుకురావడానికి అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి ఒక్క రూపాయి కూడా చేతులు మారినప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుంది. రేవంత్ రెడ్డి తప్పిదాలను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ప్రశ్నించినందుకే కేటీఆర్పై ఈ కేసు పెట్టారు. అటేన్షన్ డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధు ఎగగొట్టడం వల్ల ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. అన్ని సర్వే రిపోర్టులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి. అందుకే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అక్రమ కేసు పెట్టి అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. భవిష్యత్తులోనూ తమలాంటి నాయకులపై కేసులు పెడతారని మాకు తెలుసు.
ఎన్నో పోరాటాలతోనే త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్కు ముఖ్యం. రేవంత్ రెడ్ని కూడా ఫార్ములా-ఈ కంపెనీ ప్రతినిధి కలిసినా ఇప్పటిదాకా బయట పెట్టలేదు. రైతు భరోసాను తగ్గించి ప్రజలకు ఇస్తున్నందుకు.. వారి నుంచి వచ్చే వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే. ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేమెప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమే. కేటీఆర్పై పెట్టిన కేసులు కానీ, పార్టీ నేతలపై పెడుతున్న కేసులను కానీ పార్టీ ఎదుర్కొంటుంది. కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం. మాకు అధికారులపై, కోర్టులపై విశ్వాసం ఉంది. కానీ రేవంత్ రెడ్డి పైన లేదు.
కోర్టులో వచ్చిన తీర్పు పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ విచారణ మాత్రమే చేయమని హైకోర్టు చెప్పింది. విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కొంతమంది హైకోర్టు తీర్పును తప్పుడుగా వక్రీకరిస్తున్నరు. కేటీఆర్పై పెట్టిన కేసు తుఫేల్ కేసు. కోర్టుల్లో నిలబడదు. కేటీఆర్ను అరెస్టు చేస్తే చేస్కోనివ్వండి. కోర్టులోనే తేల్చుకుంటాం. అక్రమ అరెస్టులకు మేము భయపడే వాళ్లం కాదు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది. గతంలో అరెస్టయి కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారు. గ్రీన్కోకి రూపాయి లబ్ధి చేయనప్పుడు వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారు. అదే గ్రీన్కో కంపెనీ ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో భారీగా నష్టపోయింది ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితం’ అని హరీశ్ రావు అన్నారు.
LIVE : BRS Leaders Press Meet at Nandi Nagar@BRSHarish https://t.co/hlKCbrw154
— BRS Party (@BRSparty) January 7, 2025