4 కోట్లమంది చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేస్తారా?
తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా?
ప్రధానిపై ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : నాలుగు కోట్ల మంది చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేస్తారా? అంటూ ప్రధాని మోదీపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను బీజేపీ ఎలా ఆమోదించిందో గుర్తుచేస్తూ ‘ఇదెక్కడి న్యాయం’ అంటూ ప్రశ్నించారు. ‘బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్తోపాటు అనేక ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకించినప్పటికీ, ప్రతిపక్షాలు డివిజన్ అడిగినప్పటికీ, మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు పాస్ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? ఇదెకడి రాజ్యాంగ విధానం మోదీ గారు? పాలక, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్థించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమా? 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్ధతి మోదీ గారు? రైతు వర్గం అంతా తీవ్రంగా వ్యతిరేకించినా మీరు వ్యవసాయ బిల్లులు తేవడం న్యాయమా? ప్రాణాలకు తెగించి సీఎం కేసీఆర్ గారు చేసిన పోరాటం, వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా? ఇదెకడి న్యాయం మోదీ జీ!’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.