Harish Rao | ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ల అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడారు. పండుగ సమయంలో అర్ధరాత్రి పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగులగొట్టి అరెస్టులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు.
ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని డీజీపీ శివధర్ రెడ్డిని హరీశ్రావు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు టెర్రరిస్టులు కాదు? వారిపట్ల ఎందుకు అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అడిగారు. వాళ్ల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయి, పండుగ పూట అరెస్టులు సరికాదని అన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రేవంత్ సర్కార్ తీరుపై హరీశ్రావు మండిపడ్డారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని విమర్శించారు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని మండిపడ్డారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్రావు అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని అన్నారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియాపై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? అని ప్రశ్నించారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.