హైదరాబాద్: చెన్నూరు మాజీ శాసనసభ్యులు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు భౌతిక కాయానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు. హైదరాబాద్లోని యశోద దవాఖానలో ఉన్న పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. గత కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం వడ్డే కొత్తపల్లిలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు.
కాగా, మాజీ ఎమ్మెల్యే, ఎండోక్రైనాలజిస్ట్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్రావు స్వస్థలం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వడ్డేకొత్తపల్లి. 1974 లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆయన 1984లో డీఎం పట్టా అందుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగం ప్రారంభించి, గాం ధీ మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ విభాగం అధిపతిగా 1999లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వివిధ హోదాల్లో కొనసాగి వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని 8 పరిశోధన పత్రాలను ప్రచురించారు. జాతీయ, అం తర్జాతీయ వైద్యుల సొసైటీల్లో సభ్యుడిగా ఉన్న ఆయనకు 2014లో ఎండోక్రైనాలజీ విభాగంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, 2016లో డయాబెటిక్ విభాగంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వరించాయి.
సుధాకర్రావు తండ్రి యతిరాజారావు ఉమ్మడి ఏపీలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ రావు అంచనాల కమిటీ సభ్యుడిగా, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్గా వ్యవహరించారు. నిరుడు ఆగస్టు 14న ఆయనను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా నాటి సీఎం కేసీఆర్ నియమించారు.