దుబ్బాక, జనవరి 2: కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడుదొంగలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకిచ్చిన ప్రతి హామీతోపాటు ఇవ్వని హామీలెన్నింటినో నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అయితే.. మాటలు తప్ప ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టడం లేదని మండిపడ్డారు. భవిష్యత్తులో ఢిల్లీలో గొంతు విప్పలన్నా, రాష్ట్ర హక్కులు సాధించుకోవాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమని, కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధిచెప్పి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు సగం వేతనాన్ని ఇచ్చినా, కేసీఆర్ సర్కార్ ప్రజలకు మాత్రం అన్ని సంక్షేమ పథకాలు అందించిన విషయాన్ని హరీశ్రావు గుర్తుచేశారు.
దుబ్బాక అంటే ఉద్యమాలకు కేరాఫ్ అని ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తుచేశారు. శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక సత్తాను చాటి చెప్పారని అభినందించారు. కొత్త ప్రభాకర్రెడ్డి కత్తిపోటుకు గురై దవాఖానలో ఉంటే…కార్యకర్తలు సైనికులుగా పని చేసి గెలిపించారని కొనియాడారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ రవీందర్రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, నాయకులు పాల్గొన్నారు.