హైదరాబాద్: మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇప్పటికీ పెరిగిన జీతం ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన జీవోను కాపీ కొట్టి రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకున్నదని మండిపడ్డారు. మూడు నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి గతేడాది కాలంగా వారిని పాత జీతానికే పని చేపించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీతాన్ని రూ.13,650 నుంచి తిరిగి రూ.7,800కి తగ్గించడం దారుణమని, బహుశా పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయానికి తెర లేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమోనని ఎద్దేవా చేశారు. అన్నిట్లో తెలంగాణ రైజింగ్ అని చెబుతూ అంగన్వాడీల జీతాలు తగ్గించడం ఎంతవరకు సమంజసమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న మహిళల కడుపు కొడుతున్నాదని మండిపడ్డారు. మే నెల జీతాన్ని 8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి మిగతా జిల్లాల వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మినీ అంగన్వాడీలు ప్రచార సాధనాలు కాదని, వారికి నిజమైన గౌరవం ఇవ్వాలన్నారు. జనవరి 2024 నుంచి 12 నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్చేశారు. అంగన్వాడీ కేంద్రాలుగా మారిన ప్రతీ చోట హెల్పర్లను నియమించాలన్నారు. మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే చెల్లించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
‘తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న మానసిక వేదన, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మీ దృష్టికి తీసుకురాదలిచాను. రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నారు .వీరంతా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అత్యంత పేదవర్గాలకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తల కష్టాలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 5న వారికి అంగన్వాడీలుగా పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసింది. అయితే, ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేదు .
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క.. మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. 2023 డిసెంబర్ 15న ఇదే విషయంపై జీవో కూడా జారీ చేశారు. కానీ, అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో. దాన్నే తిరిగి కొత్తగా ప్రచారం కోసం విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు.
2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు అంగన్వాడీ పే గ్రేడ్లో రూ.13,650 జీతం చెల్లించిన ప్రభుత్వం, ఆ తర్వాత మినీ అంగన్వాడీ జీతం రూ.7,800కి తగ్గించి, 2025 ఏప్రిల్ వరకు అదే జీతం చెల్లించింది. ఈ విధంగా, మూడు నెలలు అంగన్వాడీలుగా గుర్తించి, తిరిగి సంవత్సర కాలం మినీ అంగన్వాడీ జీతాలతో పనిచేయించడంతో వీరి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురిచేసింది. బహుశా పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయానికి తెర లేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో! అన్నిట్లో తెలంగాణ రైజింగ్ అని చెబుతూ అంగన్వాడీల జీతాలు తగ్గించడం ఎంతవరకు సమంజసం?.
మినీ అంగన్వాడీలు తమ హక్కుల కోసం మంత్రి గారిని, అధికారులను అనేకసార్లు కలిసినా, ప్రభుత్వం స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంపై ప్రశ్నించిన తర్వాత, 2025 ఏప్రిల్లో మళ్లీ పాత జీవోను తిరిగి విడుదల చేస్తూ, మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తున్నామని ప్రచారం చేసుకున్నారు.
అయినప్పటికీ, మే నెలలో కేవలం ఎనిమిది జిల్లాల్లోని మినీ అంగన్వాడీలకు మాత్రమే అంగన్వాడీ పే గ్రేడ్ జీతాలు చెల్లించి, మిగతా జిల్లాల వారికి జీతాలు చెల్లించలేదు. ఈ అస్పష్టత, అయోమయం వీరిని మరింత గందరగోళంలోకి నెట్టింది. ఒకే పనికి రెండు సార్లు జీవోలు జారీ చేసి, రాజకీయ ప్రచారం చేసుకోవడం తప్ప, మినీ అంగన్వాడీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. మినీ అంగన్వాడీలు మీ ప్రచార సాధనాలు కాదు. గ్రామీణ తెలంగాణలోని పేద ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తున్న కార్యకర్తలు. వారి కడుపు కొట్టడం, వారి కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మినీ అంగన్వాడీల విషయంలోనే కాదు మహిళలను అన్ని విషయాల్లో మోసం చేస్తోంది.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మరీ మహిళలను మోసం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మోసం, రాష్ట్రంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని మోసం, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తానని మోసం, లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని మోసం, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని మోసం, అంగన్వాడీలకు 18,000 నెలసరి జీతం పెంచుతామని మోసం, మినీ అంగన్వాడీలను అంగన్వాడీలను చేస్తామని మోసం. ఇలా కాంగ్రెస్ మహిళలకు చేసిన మోసాల లిస్ట్ రాస్తే చాంతాండంత అవుతుంది .
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తాను విడుదల చేసిన జీవోను గౌరవించి జనవరి 2024 నుంచి మినీ అంగన్వాడీలకు పెంచిన జీతం చెల్లించాలి. ఏడాదిగా పెండింగ్లో ఉన్న జీతాలను పూర్తి స్థాయిలో 3,989 మంది మినీ అంగన్వాడీలకు చెల్లించాలి. మినీ అంగన్వాడీ నుండి అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట హెల్పర్లను వెంటనే నియమించాలి. మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే అందరికీ జీతాలుచెల్లించాలి. మినీ అంగన్వాడీల ఆవేదనను అర్థం చేసుకుని సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను.’ అని లేఖలో పేర్కొన్నారు.