న్యూస్నెట్వర్క్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభయహస్తం కో కాంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్-2009 పేరుతో మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం ఆయా మహిళల ఖాతాల్లో జమచేయనున్నది. ఈ సొమ్మును ఇదే నెలలో ఆయా మహిళల ఖాతాల్లో జమచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా ఈ నెలాఖరులోగా బ్యాంక్ల ద్వారా వడ్డీలేని రుణం అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఈ రుణాలకు బ్యాంక్ లింకేజీ పెట్టినట్టు తెలిపారు. రిసోర్స్ పర్సన్(ఆర్పీ)ల వేతనాలు 30 శాతం మేర పెంచుతామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ దవాఖానలను సందర్శించారు. ఆసిఫాబాద్లో రూ.50 కోట్లతో నిర్మించనున్న 340 పడకల ఏరియా దవాఖానతో పాటు రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి చేపట్టిన వివిధ పథకాలను గురించి వివరించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్.. గర్భిణులకు మరింత పోషకాహారాన్ని అందించడానికి న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభిస్తారని, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు త్వరలోనే మెడికల్ కాలేజీని మంజూరుచేస్తారని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ‘సింగరేణి లాస్లకు పోవాలె.. సింగరేణి మూత పడాలె.. ఇక్కడి ప్రజలు రోడ్డున పడాలి..’ ఇదీ బీజేపీ లక్ష్యం అంటూ దుయ్యబట్టారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని చెప్పారు.
ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ప్రారంభించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రెండు నెలలుగా దీక్షలు చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే సీసీఐని తెరిపించాలని డిమాండ్ చేశారు. సీసీఐని ప్రారంభిస్తే రాయితీలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం లేఖరాసినా కేంద్రం స్పందించడం లేదని చెప్పారు. కేంద్రానికి చేతకాకపోతే సీసీఐని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తాము ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. సీసీఐ సాధన కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పెరిగిన గ్యాస్ ధరలతో పేదలు కట్టెల పొయ్యి వాడే పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. నిరుద్యోగుల విషయంలో మాట్లాడే నైతికహక్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి లేదని అన్నారు. విప్బాల్క సుమన్ మాట్లాడుతూ.. మెరుగైన రవాణా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, నేషనల్ హైవే అడవులు, సింగరేణి, గోదావరి జిల్లాలు, కష్టించే యువకులు, అన్ని వనరులు ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కోల్బెల్ట్ ఏరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, రేఖానాయక్, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు మంత్రులకు ఘనస్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి హరీశ్రావుకు క్రేన్ సాయంతో భారీ గజమాలను వేశారు.