ఖమ్మం, జనవరి 29 : ‘బండి సంజయ్.. గల్లీల్లో మిలియన్ మార్చ్ చేసుడు కాదు, ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కొట్లాడు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆర్థికమంత్రి హరీశ్రావు హితవు చెప్పారు. బీజేపీ విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయానికి పెట్టిందని ఆరోపించారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని, ఐఏఎస్లను గుప్పిట్లో పెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్రంలోని వారి పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి.. చీటికిమాటికి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేలా, నిరుద్యోగులను మోసం చేసే లా వ్యవహరించడం ఆయనకు పరిపాటిగా మారిందని విమర్శించారు. దేశంలో జీడీపీ పతనం, ఆకలి కేకలు, నిరుద్యోగ సమస్య తాండవిస్తుంటే పట్టించుకోని బండి.. ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. 317 జీవోను రద్దుచేయాలని బీజేపీ ఎందుకు అడుగుతున్నదో ఆ పార్టీకే స్పష్టతలేదని, 317 జీవోను రద్దుచేయటమంటే రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. 317 జీవో వల్ల స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, బీజేపీ ఉద్దేశంలో స్థానికులకు ఉద్యోగాలు రావొ ద్దా? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ఇప్పించాలని డిమాండ్చేశారు. నకిలీ వాట్సాప్లతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని బండిని విమర్శించారు. దళితబంధును బీజేపీ వద్దంటున్నదని, సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువు చెప్తామంటే అడ్డు పడుతున్నదని ధ్వజమెత్తా రు. చివరికి కరోనా కష్టకాలంలో మంత్రులుగా ప్రాణాలకు తెగించి జిల్లా పర్యటనలు చేస్తూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటుంటే ఓర్వలేక విద్యార్థులు, యువకులను రెచ్చగొడుతూ తమ పర్యటనలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చేయదు.. చేయనివ్వదు
కేంద్రం అమలుచేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ర్టానికి చోటుదక్కడం లేదని మంత్రి అన్నారు. దేశంలో 7 ఐఐటీలను మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని, ఐఐఐటీల్లోనూ అన్యాయం జరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరుచేస్తే రాష్ర్టానికి ఒక్కటీ ఇవ్వలేదని విమర్శించారు. 84 నవోదయ పాఠశాలల్లో తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని చెప్పారు. వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని, విద్యుత్తు రంగంలో అగ్రగామిగా ఉన్నదని నీతిఆయోగ్ చెప్పిందని గుర్తుచేశారు. రెండేండ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన 900 కోట్లలో ఒక్క పైసా కూడా రాలేదని అన్నారు. రాష్ట్ర వాటా ఎందుకు ఇవ్వదో కేంద్రం స్పష్టంచేయాలని డిమాండ్చేశారు. బీజేపీ ప్రభుత్వం చేయాల్సింది చేయదని, చేసేవారిని అడ్డుకొంటున్నదని ఆరోపించారు. రాష్ర్టానికి మంచి చేసేందుకు బండి సంజయ్ ప్రయత్నించాలే తప్ప, అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నంచేస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భదాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాకే 8 మెడికల్ కాలేజీలు
సత్తుపల్లి/ సత్తుపల్లి రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29: డబ్బు ఏండ్ల ఆంధ్రా పాలనలో తెలంగాణకు ఎన్నడూ మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన దాఖలాలు లేవని, స్వరాష్ట్రం సిద్ధించాకే వచ్చాయని మంత్రి హరీశ్ అన్నారు. గతంలో నాలుగు కాలేజీలు మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేసుకోగా, ఇప్పుడు మరో 8 కాలేజీలను రూ.4 వేల కోట్లతో మంజూరు చేసుకొన్నామని చెప్పారు. భద్రాద్రి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ భద్రాద్రికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారని అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో రామవరంలో రూ.18 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. సత్తుపల్లిలో వంద బెడ్ల దవాఖానను ప్రారంభించారు. అదే మండలం నారాయణపురంలో షిరిడీ సాయి జనమంగళం ట్రస్టు ఆధ్వర్యంలో వందల కోట్ల వ్యయంతో 250 బెడ్లతో నిర్మించే సూపర్ స్పెషాలిటీ దవాఖానకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. పాల్వంచ సమీపంలోని నవభారత్ ఏరియాలో 25 ఎకరాల్లో చేపట్టిన మెడికల్, నర్సింగ్ కాలేజీల పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటి జ్వర సర్వే సూపర్హిట్ అయ్యిందని, ఇదే ఫార్ములాను ఇతర రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని అన్నారు. జిల్లా దవాఖాన పైభాగంలో నిర్మిస్తున్న 180 బెడ్ల వార్డును వేగంగా పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ సూచించారు.