హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరు లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 1100 కోట్ల రూపాయలతో నిర్మాణానికి పరిపాలన అనుమతులు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు.
జనవరి మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో నూతనంగా నిర్మించే 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నలువైపులా నిర్మించే నాలుగు టిమ్స్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్ధాపన చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు అన్నారు.
మెడికల్ కాలేజీల నిర్మాణంపై సోమవారం బీఆర్కే భవన్లో ఆరోగ్య, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయా కాలేజీలకు సంబందించిన డిజైనింగ్ ఏజెన్సీలు, అధికారులతో సమీక్ష జరిపారు. కాలేజీల నమూనాలను సీఎస్, హెల్త్ సెక్రెటరీ, సంబంధిత ఇతర వైద్య అధికారులతో పరిశీలించారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే రాష్ట్రానికి మెడికల్ హబ్గా మారుతుందన్నారు.
ఇదే సమయంలో 8 నూతన మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే మారుమూల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీల నిర్మాణం ఉండాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట డిజైన్లు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం రూపొందించాలన్నారు.
వైద్యాధికారులు, ఇంజినీరింగ్ విభాగం, ఎన్ఎంసీ నిబంధనల మేరకు మరోసారి మంగళవారం నాడు సమీక్షించుకుని పూర్తి స్థాయి నమూనాలను, అంచనాలను రూపొందించాలని చెప్పారు. ఆధునిక పద్దతులతో, మెరుగైన వైద్య సదుపాయాలు ఉండేలా రూపొందించాలన్నారు. నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. అన్ని కళాశాలల నమూనాలను పరిశీలించారు. ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేసేందుకు పనులు వేగిరం చేయాలన్నారు.
విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పల్లె దవాఖానల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే టర్షియరి కేర్ సేవలు అందించడం సాధ్యం అవుతుందన్నారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ ఐడీసీఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.