రామాయంపేట/సిద్దిపేట, ఏప్రిల్ 21: ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ మరెన్నో రోజులు ఉండదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు జోస్యం చెప్పారు. మాటప్పిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల, చిన్నకోడూర్ మండంల పెద్దకోడూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మహిళా రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ఇచ్చిన హామీలను వందరోజుల్లో అమలు చేస్తామన్న రేవంత్రెడ్డి నాలుగు నెలలైనా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిన సీఎం రేవంత్ను ప్రజలు ఛీకొడతారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు దాటినా ధాన్యం తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తుతున్నా అసలత్వం పనికిరాదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కారు ఎంతోకాలం నిలవదని తెలిపారు.
తొందరపడి ధాన్యం అమ్ముకోవద్దు
రైతులకు తాము అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడొద్దని, తొందరపడి ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించవద్దని హరీశ్రావు రైతులను కోరారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చెయ్యలేదని, రైతుబంధు ఇవ్వలేదని, బోనస్ రూ. 500 ఎగ్గొట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ బాధలను హరీశ్రావుకు చెప్పుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ ఇచ్చిండని, ఇప్పుడు ఏమీ లేవని ఓ మహిళా రైతు వాపోయింది. మోహన్రెడ్డి అనే మరో రైతు మాట్లాడుతూ కరెంటు తిప్పలతో మోటార్ కాలిపోయి రూ. 22 ఖర్చు అయిందని, రైతుబంధు రాలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగుండె సార్ అని పేర్కొన్నాడు. హరీశ్రావు వెంట రామాయంపేట పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, నిజాంపేట మాజీ సర్పంచ్ కొమ్మాట సత్యనారాయణ తదితరులున్నారు.