Harish Rao | నారాయణఖేడ్/సంగారెడ్డి ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రైతులకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని, లేకపోతే రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 16న సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, జనసమీకరణపై ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో మాజీ మంత్రి హరీశ్రావు సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేసి, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తొందరపడి ధాన్యాన్ని అమ్మొద్దని, ప్రభుత్వం మద్దతు ధర, బోనస్ ఇచ్చే వరకు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. సీఎం రేవంత్కు రైతులు లేఖలు రాసి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టాలని కోరారు. రైతు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు రైతులతో ఉత్తరాలు రాయించాలని సూచించారు.
ప్రభుత్వం వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడాను గుర్తించారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రహస్య ఒప్పందం చేసుకొన్నాయని ఆరోపించారు. బీజేపీ మ్యానిఫెస్టో డొల్ల అని, దేవుడి పేరుతో రాజకీయం చేసే ఆ పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ మాదిగలకు కేటాయించకపోవటం విడ్డూరం గా ఉన్నదని విమర్శించారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మైనార్టీకీ స్థానం కల్పించలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్లో తెలంగాణవాదం వినిపించాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలన్నా ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, జైపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.
సుల్తాన్పూర్ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరుకానున్నారు. యువత, రైతులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేపడుతున్నది. 16న సాయంత్రం కేసీఆర్ బహిరంగసభ ప్రారంభం కానున్నది. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా సుల్తాన్పూర్లోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.