జిన్నారం/గజ్వేల్, ఫిబ్రవరి 7: ‘గోడలకు సున్నాలు వేసుకొనే రేవంత్రెడ్డి.. పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా ఆయన బతుకంతా అవినీతిమయం. నోట్లకట్టలతో దొరికిననాడే రేవంత్రెడ్డికి బేడీలు వేసి ఊరేగించాల్సి ఉండె. కేసీఆర్ మంచోడు కాబట్టే ఆయన్ని ఆనాడు వదిలిపెట్టిండు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం, జిన్నారం, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణాల్లో శనివారం నిర్వహించిన రోడ్షోలు నిర్వహించారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీల క్లిప్లను ప్రజలకు చూపారు. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తే, ప్రస్తుత సీఎం ఆ పథకాల్లో కోత పెడుతున్నారని ఆరోపించారు.
నీతి, నిజాయితీ, పద్ధతి లేకుండా వయసులో పెద్దవాడైన కేసీఆర్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం రేవంత్రెడ్డికి తగదని హితవు పలికారు. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ మనోడు కాదని రేవంత్రెడ్డి అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు కాళ్ల దగ్గర రేవంత్రెడ్డి ఉన్నాడని, ఆయన ఆంధ్రోళ్లకు సద్దులు మోసిన తలంగాణ ద్రోహి అని విమర్శించారు. రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ నీళ్లను ఒడిసి పడితే.. రేవంత్రెడ్డి ఆంధ్రకు నీళ్లను పంపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పథకాలపై ప్రశ్నిస్తే తమపై లేనిపోని కేసులు పెడుతున్నాడని, ఎన్ని కేసులు పెట్టినా చెప్పిన హామీలను అమలు చేసే దాకా ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.
ప్రజలకు ఏం చేసిందని బీజేపీ ఓట్లు అడుగుతున్నదని, ప్రజలు తమ ఓటును బీజేపీకి వేసినా, మోరీలో ఒక్కటేనని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, అప్పుడే సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయవచ్చని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరుతెరిస్తే అన్నీ అబద్ధ్దాలే మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు. మిషన్ కాకతీయలో రూ.55 వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఎంపీ మాట్లాడుతుండని, అసలు మిషన్ కాకతీయకు ఖర్చు పెట్టిందే రూ.5 వేల కోట్లని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.84 వేల కోట్లు ఖర్చు పెడితే.. లక్ష కోట్ల అవినీతి చేశారని బద్నాం చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్రెడ్డి, ఇన్చార్జి పాల సాయిరాం, మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, వెంకటేశంగౌడ్, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సతీమణి యాదమ్మ, నాయకులు ప్రకాశ్చారి, రాజేశ్, పాండురంగారెడ్డి, విక్రంరెడ్డి, కల్పన తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాధాకృష్ణశర్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, దేవి రవీందర్, మధు, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.