హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం వైఖరి ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించినట్టు’ ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. గాంధీ దవాఖానలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించి పాలాభిషేకాలు చేయించుకుంటున్నరు. నిజంగా నిజాయతీ ఉంటే మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నాడు పెట్రోల్, డీజిల్ మీద ఉన్న పన్నులనే ఇప్పుడు అమలు చేయండి’ అని డిమాండ్ చేశారు. 2014 మార్చిలో డీజిల్ మీద సెస్సు రూ.3.46 ఉండేదని, బీజేపీ దానిని రూ.31కి పెంచిందని గుర్తుచేశారు. బీజేపీ తాజా తగ్గింపుతో అది తిరిగి రూ.3కు రాలేదని అన్నారు. ప్రస్తుతం డీజిల్పై రూ.7.40, పెట్రోల్పై రూ.16.40 సెస్సును కేంద్రం వసూలు చేస్తున్నదని చెప్పారు. తెలంగాణలో పెట్రో ధరలపై ఒక్కసారి కూడా పన్ను పెంచలేదని స్పష్టం చేశారు. ‘మేం పెంచితే కదా.. తగ్గించడానికి. మీరు 2014లో ఎంత సెస్సు ఉందో అంతకు తగ్గించి మాట్లాడండి’ అని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాంతాడంత పెంచి.. మూరెడు దించారని కేంద్రాన్ని విమర్శించారు. 2014లో సిలిండర్ ధర దాదాపు రూ.400 ఉండేదని, ఇప్పుడు దాన్ని రూ.వెయ్యికి పెంచారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం రూ.600 పెంచి రూ.200 తగ్గించిందని గుర్తు చేశారు. ఈ తగ్గింపు కూడా ఉజ్వల్ పథకం లబ్ధిదారులకేనని.. అంటే 10 మందికి పెంచి, నలుగురికి తగ్గించారని ఎద్దేవా చేశారు. ఈ మాత్రం దానికే ‘మేం తగ్గించినం అని చప్పట్లు కొట్టుకునుడు.. జబ్బలు చరుచుకునుడు ఏంది?’ అని నిలదీశారు. దమ్ముంటే అప్పుడున్న ధర రూ.400కు తగ్గించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. గతంలో గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ రూ.400 ఉండేదని, దాన్ని కొంత కొంతగా తగ్గిస్తూ ఇప్పుడు పూర్తిగా ఎత్తేశారని విమర్శించారు. గ్యాస్ ధర తగ్గింపుపై బీజేపీ చేసే ప్రచారం అంతా హంబక్.. బోగస్ అని కొట్టిపారేశారు.