సిద్దిపేట, జూన్ 26: డబ్భు ఏండ్ల సమైక్యపాలనలో తెలంగాణలో నాలుగు వైద్య కళాశాలలు ఉంటే, స్వరాష్ట్రం సిద్ధించాక ఏడేండ్లలోనే 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకొన్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యవిద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంచేశారు. సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆదివారం స్టడీమెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్వీ రూపొందించిన ఫ్లెక్సీలను హరీశ్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొస్తున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్త్తీ మరిచి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ సర్కారు అసమర్థ విధానాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సంక్షోభంలో పడ్డారని విమర్శించారు. దేశ పురోగతిలో రూపాయి విలువ, సిపాయి విలువ తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో మతకల్లోలాలు, హింస తప్ప సాధించిన గుణాత్మక మార్పు ఏమీలేదని ఎద్దేవాచేశారు. బీజేపీ అంటేనే అబద్దాల పార్టీ అని పునరుద్ఘాటించారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్వీ శ్రేణులకు సూచించారు. సోషల్మీడియాలో బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అడుగడుగునా తెలంగాణకు అన్యాయం
కేంద్రంలోని బీజేపీ సర్కారు అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని హరీశ్రావు ఆరోపించారు. వాటా ప్రకారం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నవోదయ విద్యాలయాలు, వైద్యకళాశాలలు, ఐటీ పార్కులు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నదని ధ్వజమెత్తారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలను నీతిఆయోగ్ సైతం అభినందించిందని మంత్రి గుర్తుచేశారు.