Harish Rao | డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిధారెడ్డి అని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో నందిని సిధారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులను కవులు, కళాకారులను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించారని హరీశ్రావు తెలిపారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరిపోశాయని పేర్కొన్నారు. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తెలంగాణతో పాటు సిద్దిపేట ప్రాంతానికి దక్కిన గౌరవమని అన్నారు. ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్యం కోసం పనిచేశారని తెలిపారు.
కేసిఆర్ సీఎం అయ్యాక ఉన్నత స్థాయి పదవి ఇస్తానంటే తీసుకోకుండా సాహిత్య రంగంలో జరగాల్సింది ఇంకా చాలా ఉందని.. సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి తనకు బాధ్యతలు ఇవ్వాలని కోరారని తెలిపారు. దీంతో కేసీఆర్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి సిధారెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ప్రపంచంలోనే తెలుగు మహాసభలు హైదరాబాద్ లో ఎంతో అద్భుతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆంధ్ర వారే ఈ తెలుగు మహాసభలు నిర్వహించవచ్చని తెలంగాణ వారికి తెలుగు మహాసభలు నిర్వహించరాదని సృష్టించిన అపోహాలను తొలగించి ఎంతో గొప్పగా మహాసభలు నిర్వహించారన్నారు.
నందిని సిధారెడ్డి పొగడ్తలు, సన్మానాలకు దూరంగా ఉంటూ సాహిత్యం కోసం ప్రజల కోసం ఎంతో పని చేశారని హరీశ్రావు తెలిపారు. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుందని అన్నారు. ఆనాటి కాలంలో ఫేక్ ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, అంటరానితనం, మద్యపాన నిషేధం, నీటి గోస, వలసలు ఇలా అనేక రంగాల్లో పుస్తకాలు రాసి ప్రజలకు చైతన్యం కల్పించారని పేర్కొన్నారు.