Harish Rao | బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి డీటీవో వెంకన్న మరణించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అనుమానం వ్యక్తం చేశారు. వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని మండిపడ్డారు.
అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. డీటీవో వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్ లారీ డీటీవో వెంకన్నను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకన్న అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద ధాటికి వెంకన్న మృతదేహం నుజ్జునుజ్జయ్యింది.