Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందని, దానికేదో మేం కారణమన్నట్లు కాంగ్రెస్ బురదజల్లడం సరికాదని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. ఈ విషయంపై వివరణ ఇద్దామంటే మాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు.. గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. సభలో అవకాశం ఇవ్వకపోతే మీడియా పాయింట్కు వెళ్దామంటే అడ్డుకున్నారు. మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. 2007లో ప్రాణహిత – చేవెళ్లకు జీవో ఇచ్చారు. 17 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేస్తామని జీవోలో పేర్కొన్నారు. 2008లో దాన్ని రూ. 38 వేల 500 కోట్లకు తెచ్చారు. ఏ పనులు చేయకుండానే అంచనాలు ఎందుకు పెరిగాయి. మళ్ల ఒక్క సంవత్సరం లోగా సీడబ్ల్యూసీకి రూ. 40 వేల కోట్లతో డీపీఆర్ పంపించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇది నిజం కాదా..? ఈ రోజుకు ఆ రోజుకు ఎంత మార్పు వచ్చింది. నాడు 14 టీఎంసీల రిజర్వాయర్లు ఉంటే.. ఇవాళ 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యంతో కాళేశ్వరం కట్టాం. మరి ఈ రిజర్వాయర్లు కట్టాలంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. భూసేకరణ చేయాలి. మూడు బ్యారేజీలు, పంపు హౌస్లు కట్టాల్సి ఉంటుంది. మరి ప్రాజెక్టు కాస్ట్ పెరగదా..? అని హరీశ్రావు నిలదీశారు.
కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో చంద్రబాబు, రాజేశేఖర్ రెడ్డి కాలయాపన చేశారు. బాబు శిలాఫలకాలు వేస్తే రాజశేఖర్ రెడ్డి మొక్కలు పెంచారు.. రాజశేఖర్ రెడ్డి శిలాఫలకాలు వేస్తే బాబు మొక్కలు పెంచారు. కానీ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. 2014లోనే 90 శాతం పూర్తి చేశామని చెప్పారు. మరి 13 వేల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చారు. కల్వకుర్తి కింద 3 లక్షల 30 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండే. మరి ఎందుకు ఇవ్వలేదు. మేం వచ్చిన తర్వాత దృష్టి పెట్టి 3 లక్షల 7 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కెనాల్స్ బాగు చేసి నీళ్లు అందించాం. కాళేశ్వరంలో కూడా 90 శాతం మేజర్ పనులు అయిపోయాయి. కేవలం మైనర్స్, సబ్ మైనర్స్ తవ్వాలి. మేం కల్వకుర్తిలో చేయలేదా..? మీరు కాళేశ్వరంలో చేయలేరా..? అని ప్రశ్నించారు.
నెట్టెంపాడు కింద మీరు 90 శాతం పూర్తయిందని చెప్పి 2,300 ఎకరాలకు సాగునీళ్లు ఇస్తే.. మేం పెండింగ్ పనులు పూర్తి చేసి లక్షా 40 వేల ఎకరాలకు నీళ్లందించాం. బీమా కింద 12 వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే.. మేం కాల్వలు పూర్తి చేసి లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కాళేశ్వరం విషయంలో మీరు చేయాల్సింది కాల్వలు తవ్వి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వండి. మేడిగడ్డపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తానే ఓపెన్గా డిమాండ్ చేశాను. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టండి. ఆలస్యం చేస్తే ప్రజలకు సాగు, తాగునీటికి కష్టాలు వస్తాయని హరీశ్రావు తెలిపారు.