నర్సాపూర్, డిసెంబర్13: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు చెప్పారు. గెలుపు ఓటములు సహజమని.. కష్టపడుతూ ముందుకు సాగాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదొడుకులు సహజమని, గతంలో ఓడి గెలిచామని పేర్కొన్నారు. విజయం పొందినప్పుడు విర్రవీగలేదని, ఓడినప్పుడు కుంగిపోలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు నిజాన్ని గ్రహిస్తారని, పనిమంతులెవరో తేలుస్తారని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గ కృతజ్ఞతాసభలో హరీశ్రావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పనితనం తప్ప పగతనం తెలియని వ్యక్తి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పారు. సాధించిన తెలంగాణ కక్షలతో, పగలతో ఇబ్బంది పడొద్దని పనిమీద కేసీఆర్ దృష్టిపెట్టారని గుర్తు చేశారు. అధికారం కోల్పోవడం స్పీడ్ బ్రేక్ మాత్రమేనని, అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టేనని తెలిపారు. అధికార పార్టీ నాయకులు మానసికంగా దెబ్బతీయడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతారని, ఇబ్బందులకు గురిచేస్తారని, ధైర్యం కోల్పోవద్దని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
లోక్సభలోకి అగంతకులు దూరడం దురదృష్టకరం
లోక్సభలోకి అగంతకులు దూరి కలర్ గ్యాస్ను చల్లడం దురదృష్టకరమని హరీశ్రావు పేర్కొన్నారు. పార్లమెంట్కు రక్షణ లేకపోవడం బాధాకరమని, అదృష్టం బాగుండి ఎంపీలకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి భద్రత కట్టుదిట్టం చేయాలని కోరారు. పార్లమెంట్కే రక్షణ లేకుండా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ నాయకులు అశోక్గౌడ్, గాలి అనిల్కుమార్, సింగాయిపల్లి గోపి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.