రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే, రైతులకు సమస్యలు సృష్టించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్రప్రభుత్వం చూస్తున్నది. టీఆర్ఎస్.. బీజేపీ మాదిరి కార్పొరేట్ల పార్టీ కాదు. మాది ఉద్యమ పార్టీ. తెలంగాణవాసుల మనసు నుంచి ఉద్భవించిన పార్టీ అనే విషయాన్ని పీయూష్ గుర్తుంచుకోవాలి. అనేక అవమానాలను, అవహేళనలను ఎదుర్కొని, కలబడి నిలబడి గెలిచినం. ఇటువంటి పార్టీపై, ఇక్కడి ప్రజలపై చేసిన వ్యాఖ్యలను పీయూష్ బేషరతుగా వెనక్కి తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పితీరాలి
– మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధమ్కీ ఇస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఉద్యమ పార్టీని, ఇక్కడి ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవులు, రచయితలు, సినిమా నటులు, జర్నలిస్టులు, వార్తాసంస్థలు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని రాత్రికి రాత్రి జైల్లో పెట్టి ధమ్కీలు ఇవ్వటం కేంద్రం విధానంగా మారిందని ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నేత జాజుల సురేందర్తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులపై, ప్రభుత్వాలపై అడ్డగోలుగా ఈడీ, ఐటీ సోదాలు చేయిస్తూ, జైల్లో పెడతామని ధమ్కీలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీది ధమ్కీల సంస్కృతి అని, రైతుల పక్షాన నిలబడేది టీఆర్ఎస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులు, నాలుగు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు గోయల్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో యాసంగిలో రా రైస్ రావని, వచ్చేది బాయిల్డ్ రైస్ అని పదేపదే చెప్పినా అర్థం కానిది పీయూష్కేనని విమర్శించారు. ఆయన రైతులను ఆగం చేస్తున్నారని ఆరోపించారు.
‘పీయూష్ గోయల్.. నువ్వు రైతు ఇంట్ల పుడితే, రైతులెక్క కష్టపడి పొలంలో పనిచేస్తే రైతుల కష్టాలు తెలిసేవి. కేంద్రమంత్రిగా అహంకారంతో రైతులను, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నావు. అహంభావంతో వ్యవహరిస్తున్న పీయూష్.. తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా పీయూష్ మరోసారి తెలంగాణపై విషం కక్కారని మండిపడ్డారు. గోయల్కు హూంకరింపులు, ఘీంకరింపులు, వక్రీకరణలు అలవాటైపోయాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించండని హేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సందర్భంలో తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని అవహేళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ నేతల వైఖరి ఏమిటని నిలదీశారు. ‘మమ్మల్ని నాలుగు మాటలు అంటే పడతాం. కానీ, మా రైతాంగాన్ని, తెలంగాణ సమాజాన్ని ఏమన్నా అంటే సహించేది లేదని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు’ అని ఈ సందర్భంగా హరీశ్రావు గుర్తుచేశారు.
తెలంగాణ ప్రజలను అవహేళన చేసేలా, రాష్ట్ర రైతాంగాన్ని అవమానించేలా.. అర్థం చేసుకోనివాళ్లకు ఏం చెప్తాం అంటూ గోయల్ అత్యంత దుర్మార్గంగా రాజ్యసభలో మాట్లాడారని, ఆ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ రైతుల కష్టాలను అర్థం చేసుకోనిది గోయలేనని తేల్చి చెప్పారు. రైతుల కష్టాలు తెలిస్తే వడ్ల కొనుగోలు సమస్యే ఉండేది కాదని కుండబద్దలు కొట్టారు. ‘గోయల్.. ఒకసారి తెలంగాణ కు వచ్చి, మా రైతులను అడిగి చూడు తెలుస్తుంది’ అని సవాల్ విసిరారు. ఆడిటర్గా డబ్బు ఎట్లా సంపాదించాలో మాత్రమే పీయూష్కు తెలుసని, కానీ రైతులను ఎలా ఆదుకోవాలో తమకు తెలుసని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, ఇప్పుడు సుభిక్షంగా ఉన్నారని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నామని, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నామని వివరించారు. పీయూష్కు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తున్నదో తెల్వదని హరీశ్ ఎద్దేవా చేశారు.
దేశంలో అన్ని రాష్ర్టాల్లో వాతావరణం ఒకేలా ఉండదని, వాతావరణానికి అనుగుణంగా పంటలు పండుతాయని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. తెలంగాణలో పండినట్టు కశ్మీర్లో వరి పండుతదా? కశ్మీర్లో పండినట్టు తెలంగాణలో యాపిల్ పండుతదా? అని ప్రశ్నించారు. దేశంలో ఒక్క తెలంగాణే 80% విత్తనాలు ఉత్ప త్తి చేస్తున్నదని, తెలంగాణ మాదిరి పంజాబ్లోనో, ఉత్తరప్రదేశ్లోనో విత్తన ఉత్పత్తి అవుతుందా? అని నిలదీశారు. ఆయా రాష్ర్టాల్లో విత్తనోత్పతికి అనుకూల వాతావరణం ఉండదని, అది తెలంగాణకే సాధ్యమని వెల్లడించారు. రైతుల గోస తెలీక పీయూష్ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ధరలు దించుడు.. పూర్తిగానే పెం చుడు.. ఇదే కేంద్ర విధానంగా మారిందని మంత్రి హరీ శ్ ధ్వజమెత్తారు. 2014లో అధికారంలోకి రాకముం దు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారని, కానీ పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేశారని ఎద్దేవాచేశారు. బాయిలకాడ మీటర్లు పెడతామని రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. బాయిలకా డ మీటర్లు పెడతామని బాంబులేసుడు.. వడ్లు కొనుమంటే చేతులెత్తేసుడు బీజేపీకి అలవాటైపోయిందన్నా రు. రైతులను లాఠీలతో చావగొట్టండి అంటూ సాక్షాత్తు హర్యానా ముఖ్యమంత్రే ఉసిగొల్పిన దుర్మార్గపు చరిత్ర బీజేపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న చరిత్ర బీజేపీదని ధ్వజమెత్తారు. ఉద్యమిస్తున్న రైతులను ఖలిస్థాన్ తీవ్రవాదులతో పోల్చి, దేశ రైతాంగాన్ని తీవ్రంగా అవమానించింది బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అస్థిత్వాన్ని, రైతులను కించపరిచేలా.. తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని అన్నా, నూ కలు తినుమని మరో కేంద్రమంత్రి తెలంగాణ రైతాంగాన్ని అవమానించినా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పం దించరా? అని హరీశ్ ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటికైనా మేలొనాలని హితవు పలికా రు. తెలంగాణ ప్రజలను అవమానపర్చినవారెవరూ బతికి బట్టకట్టలేదన్న సంగతిని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు.
తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని ఉమ్మడి పాలనలో నాటి సీఎం పేర్కొన్నారని, అదే ఏపీలో ప్రస్తు తం ఆరేడు గంటల కరెంటు కోతలున్నాయని హరీశ్ చెప్పారు. 24 గంటల నిరంతర కరెంటుతో తెలంగాణ వెలుగు జిలుగులతో మెరుస్తుంటే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో పవర్ హాలిడేలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్.. బీజేపీ మాదిరి కార్పొరేట్ల పార్టీ కాదని తేల్చిచెప్పారు. ‘ఉద్యమం, తెలంగాణ మనసుల్లోంచి ఉద్భవించిన పార్టీ టీఆర్ఎస్ అన్న విషయాన్ని పీయూష్ గు ర్తుంచుకోవాలి. అనేక అవమానాలను ఎదుర్కొని, గెలిచిన పార్టీ. అలాంటి పార్టీపై, ఇక్కడి ప్రజలపై చేసిన వ్యా ఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని పీయూష్ను డిమాండ్ చేశారు.
అబద్ధాలు చెప్పటమే కేంద్రం పనిగా పెట్టుకొన్నదని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. గోయల్ మరోసారి రాజ్యసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, రైతుల కోసం కేంద్రాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తే ధమ్కీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వరి వేయద్దని తామంటే, వరే వేయాలని, రాష్ట్రం కొనకపోతే కేంద్రంతో కొనిపిచ్చే బాధ్యత తానే తీసుకొంటానని రైతులను తప్పుదారి పట్టించిన బీజేపీ నేత ఏం జవాబిస్తారని ప్రశ్నించారు. పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేసిన ఓ పెద్దమనిషి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటని అన్నారు.
పీయూష్ కేంద్రంలో బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారని రాష్ట్రమంత్రులు, ఎంపీలు కలిశారని, ఉత్త గోయల్ అయితే ఎందుకు కలుస్తారని హరీశ్ ప్రశ్నించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే కేంద్రం నినాదంలో తెలంగాణ ప్రజలు భాగం కాదా? అని నిలదీశారు. సమస్యకు పరిష్కారం చెప్పే తొవ్వచూపుమంటే పీయూష్ తొండి మాటలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను నూకలు తినుమని ధమీలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమని, అవసరమైతే నూకలు తింటాం.. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర పాలకుల విధానాన్నే ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్నదని హరీశ్ ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర నేతలు వాడిన భాషనే గోయల్ మాట్లాడుతున్నారని అన్నారు. వడ్లు కొనుమంటే డబ్ల్యూటీవో నిబంధనలు అడ్డంకి అని పీయూష్ పేర్కొనటాన్ని హరీశ్ తప్పుబట్టారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆ ఒప్పందాన్ని మార్చేది తెలంగాణ రైతులా? ప్రపంచ దేశాలు తిరిగే ప్రధానమంత్రా? కేంద్రమా? అని నిప్పులు చెరిగారు. ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
కేంద్రం కార్పొరేట్లకు అనుకూలంగా, కర్షకులకు వ్యతిరేకంగా ఉన్నదని హరీశ్ అన్నారు. రూ.11 లక్షల కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేసిన కేంద్రానికి రైతుల గోస పట్టదా? అని ప్రశ్నించారు. 45 ఏండ్ల చరిత్రలో ఈపీఎఫ్ వడ్డీని 8.5% నుంచి 8.1 శాతానికి తగ్గించిన ఏకైక ప్రభుత్వం బీజేపీదేనన్నారు. గ్యాస్ సబ్సిడీలు ఎత్తేయటంతో పల్లెల్లో మళ్లీ కట్టెల పొయ్యిలు, ఉన్క పొయ్యిలు వస్తున్నాయని మండిపడ్డారు. ఇది తిరోగమనమా? పురోగమనమా? అని నిలదీశారు. రైతులు లేకపోతే బీజేపీ అధికారంలోకి వస్తదా? అని ప్రశ్నించారు.