సిద్దిపేట : పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు పది విద్యార్థులను స్మార్ట్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచండి అని వారి తల్లిదండ్రులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి చదువుతున్న తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు, ఇతర అధికారులతో మంత్రి హరీశ్రావు శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పది విద్యార్థులను ఈ రెండు నెలల పాటు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు.
పది ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ. 10 వేలు ప్రైజ్ మనీ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతేడాది ఫలితాలను పునరావృతం చేయాలని కోరారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలిచిందన్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పది పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలల ఉపాధ్యాయులకు రివార్డులు ఇస్తామని హరీశ్రావు తెలిపారు.