Harish Rao | మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదని డీజీపీ గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు. బెయిలబుల్ సెక్షన్లలో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణమని విమర్శించారు. హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసం వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదని.. చట్టాలకు లోబడి పనిచేయాలన్నారు.
బెయిలబుల్ కేసులు అని తెలిసి పాడి కౌశిక్ రెడ్డిని రాత్రంతా ఇబ్బంది పెట్టారని హరీశ్రావు అన్నారు. బెయిలబుల్ సెక్షన్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పిందని గుర్తుచేశారు. కానీ కావాలని పండుగ పూట డెకాయిట్లను, టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో ఎలా వ్యవహరించాలో అనేదానిపై పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నానని అన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేయడం మానుకోవాలని సూచించారు.
పాడి కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు ఉన్నాయని.. అరెస్టు చేయాలని అంటున్నారని హరీశ్రావు తెలిపారు. ఆ కేసులు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాకముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. 28 కేసులు మీరు పెట్టినవే కదా అని అడిగారు. కలెక్టర్ ఆహ్వానం మేరకు కౌశిక్ రెడ్డి మీటింగ్కు వెళ్లారని.. పిలవని పేరంటానికి ఆయన వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆ మీటింగ్లో సభ్యుడిగా నువ్వే పార్టీ తరఫున మాట్లాడుతున్నావని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను ప్రశ్నించారని.. అందులో తప్పేముందని నిలదీశారు. ఒక్క కౌశిక్ రెడ్డి కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారని అన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉంటారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్పుతా అని సంజయ్ అంటే ఎలా ఊరుకుంటారని హరీశ్రావు ప్రశ్నించారు. నువ్వే పార్టీ తరపున మాట్లాడుతున్నావని అడిగారని.. ఇలా ప్రశ్నించడంలో కౌశిక్ రెడ్డి తప్పేం లేదని స్పష్టం చేశారు. దీనికి మూడు కేసులు పెడతారా.. ఒక సంఘటన మీద ముగ్గురు వేర్వేరు ఫిర్యాదులు తీసుకుని కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మీ కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఒకే కేసులో మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి, రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం కక్ష సాధింపే కదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులే ఇవని అన్నారు. ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలని పగ, ప్రతికారంతో, కుట్రతో చేసిన అరెస్టే తప్ప మరొకటి కాదని విమర్శించారు.
న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉందని హరీశ్రావు అన్నారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు. ఇటువంటి చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని డీజీపీకి అప్పీల్ చేస్తున్నాని పేర్కొన్నారు. పండుగ పూట పోలీసులను కూడా ఇబ్బందులు పెట్టడం, టెన్షన్ పెట్టడం సరికాదని హితవుపలికారు. మీ కింది స్థాయి పోలీసులను, అధికారులను కూడా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పాడని ఈ రకంగా అక్రమ అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కౌశిక్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా నెట్టారని.. ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి మీదనే ఎందుకు కేసు నమోదు చేశారని అడిగారు. ఇందులో మీ పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు.
ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు సూచించారు. మంత్రులు, మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని బహిరంగంగా సంజయ్ ప్రకటించారని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే సంజయ్ను అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని అన్నారు. చోర్ ఉల్టా కొత్వాల్ కే డాంటి అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటున్నాడని. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన10 మంది ఎమ్మెల్యేల పై అని ఆయన స్పష్టం చేశారు. సంజయ్ పార్టీ మారాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెబుతున్నాడు కదా అని తెలిపారు. ఇంతకంటే స్పీకర్కు ఆధారాలు ఏం కావాలన్నారు. ఇంతకంటే స్పీకర్కు ఏ ఆధారాలు కావాలని అడిగారు. తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను డిమాండ్ చేశారు.
ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని హరీశ్రావు గుర్తుచేశారు. హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉండటం వల్ల ఆలస్యం అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని అన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయని.. న్యాయం నిలబడుతుందని.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ధీమా వ్యక్తంచేశారు. నిజాయతీ ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి సంజయ్ మాట్లాడాలని అన్నారు..