హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ సర్కార్.. వేలాది మంది కార్మికుల బతుకులను రోడ్డుపాలు చేసేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ టీ హరీశ్రావు ఆరోపించారు. టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు గురువారం హైదరాబాద్లోని నివాసంలో హరీశ్రావును కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టగా, కార్మికుల తరఫున రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతామని వారికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడుకోవాలని కార్మికులు పోరాడుతుంటే.. మరోవైపు రేవంత్ సర్కార్ ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు యత్నిస్తున్నదని హరీశ్రావు దుయ్యబట్టారు. రెండేండ్లుగా మహాలక్ష్మీ పథకం బకాయిల భారాన్ని ఆర్టీసీపై మోపడంతో సంస్థ కుదేలవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ స్కీమ్ కింద బాకీ పడ్డ రూ.2,804 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ రెండు పీఆర్సీలు పెండింగ్లో ఉండగా, 2025 పీఆర్సీ సైతం అందక కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు విరమణ బ కాయిలు చెల్లించకుండా రేవంత్ సర్కార్ అరిగోసపెడుతున్నదని హరీశ్రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డికి వాళ్లంటే చిన్నచూపెందుకని ప్రశ్నించారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోహెడ చంద్రమౌళి, ప్రభాకర్రావు, భిక్షపతి, జైరాం గురువారం హైదరాబాద్లో హరీశ్రావును కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దీనికి ఆయన స్పందిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వారికి భరోసానిచ్చారు.