బంజారాహిల్స్, మార్చి 27: ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను వెనక్కి ఇవ్వకుండా మోసానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సికింద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ ప్రాంతానికి చెందిన జోగుల నరేశ్కుమార్ (40) కోకాపేటలోని మాజీ మంత్రి హరీశ్రావు క్యాంపు కార్యాలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు. మంత్రి కార్యాలయానికి వచ్చే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను స్వీకరించడం, వాటిని సెక్రటేరియేట్లోని సీఎంఆర్ఎఫ్ విభాగంలో అందించడం, మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం చేసేవాడు. గత ఏడాది డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డిసెంబర్ 6న కోకాపేటలోని కార్యాలయాన్ని హరీశ్రావు ఖాళీ చేశారు. అప్పటికే 240 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉండగా, ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీ చేయలేదు. పంపిణీ చేయని చెక్కులను సెక్రటేరియేట్లో రిటర్న్ చేయాలని హరీశ్రావు ఆదేశించడంతోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి నరేశ్ను తొలగించారు.
కాగా, అసెంబ్లీలో అటెండర్గా పనిచేసే బెలగోని వెంకటేశ్ (35), ఖమ్మం జిల్లా కొణిజాల మండలానికి చెందిన కార్ డ్రైవర్ కొర్లపాటి వంశీ (24), గోదావరిఖని ప్రాంతానికి చెందిన పులిపాక ఓంకార్ (34) అనే వ్యక్తులతో చాలాకాలంగా పరిచయమున్న నరేశ్ ఆ చెక్కులను వారికి అందజేశాడు. అప్పటికే కాల పరిమితి ముగిసేందుకు సిద్ధంగా ఉన్న చెక్కుల్లో 19 చెక్కులపై ఉన్న పేర్లతో ఉన్న వేరే వ్యక్తులతో ఓంకార్ మాట్లాడి వారి అకౌంట్లో డిపాజిట్ చేశారు. మొత్తం రూ.10.46 లక్షల విలువైన 19 చెక్కులను నగదుగా మార్చుకున్న నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్ తదితరులు తలా కొంతమొత్తాన్ని పంచుకున్నారు. మిగిలిన చెక్కులను యూసుఫ్గూడలోని ఎల్ఎన్నగర్లో కాల్చేశారు. తమకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాకపోవడంతో కొంతమంది బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు రోజుల క్రితం ఐపీసీ 417, 420, 419,120(బీ) రెడ్విత్ 34 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను తాజాగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరితోపాటు స్వరూప అనే మరో మహిళ కూడా కేసులో నిందితురాలిగా ఉన్నట్టు తేలింది. ఆమె పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
డిసెంబర్లోనే హరీశ్ కార్యాలయం ఫిర్యాదు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగం కేసులో మాజీ మంత్రి హరీశ్రావు పీఏ అంటూ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని మాజీ మంత్రి హరీశ్రావు కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 6న ఆరోగ్యశాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని మూసేయడంతోపాటు సిబ్బందిని పంపిచేయడం జరిగిందని, ఆ రోజు నుంచి నరేశ్ అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగితో ఎమ్మెల్యే హరీశ్రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నది. ఆఫీసు మూసివేసిన సమయంలో నరేశ్ అనే వ్యక్తి కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు తనతో తీసుకెళ్లినట్టు తెలియడంతో గత ఏడాది డిసెంబర్ 17నే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు గుర్తుచేసింది. వాస్తవాలను గుర్తించకుండా మాజీ మంత్రి హరీశ్రావు పీఏ నరేశ్ అంటూ ప్రచారం చేయడం సరికాదని సూచించింది.