హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం చండ్ర రాజేశ్వరరావు జయంతి నిర్వహించారు. రాజేశ్వరరావు చిత్రపటానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభ్యాసంలోనే రాజేశ్వరరావు వామపక్ష భావజాలానికి ఆకర్షితులయ్యారని గుర్తు చేశారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా బెనారస్ విశ్వవిద్యాలయంలో కమ్యూనిస్టు సెల్ ఏర్పాటుకు నాంది పలికారని చెప్పారు. మెడిసిన్ విద్యను వదిలి, విప్లవ బాట పట్టారని, పోరాడి చల్లపల్లి రాజా భూములను పేదలకు పంచారని పేర్కొన్నారు. గల్లీ నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగి, లెనిన్ అవార్డు పొందారని అన్నారు. ఆయన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 25 ఏండ్లు పని చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయనాయక్, ప్రజానాట్యమండలి నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, కొండలరావు, బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, రహ్మాన్, వైఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.