Hanuman Jayanti | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేస్వామి ఆలయంలో హన్మాన్ పెద్ద జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జయంతి సందర్భంగా గర్భాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం నిర్వహించి, రకాల పండ్లు, పూలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హన్మాన్ భక్తులు తరలిరాగా.. భక్తులతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు దీక్షలను విరమించారు. దీక్షాపరులతో ఆలయ పరిసరాలన్నీ కాషాయవర్ణాన్ని సంతరించుకున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే హన్మాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి సీతారామస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రధాన ఆలయం ఎదుట ఉన్న ఆంజనేస్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామి సాయంత్రం తిరువీధి సేవ, సుందరకాండ పారాయణం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు.