సుబేదారి, నవంబర్ 27: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హనుమకొండ వాసి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్ (27) నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం నలుగురు స్నేహితులతో కలిసి సెయింట్ లూయిస్ ప్రాంతంలో విందు చేసుకున్నారు. అక్కడే ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లగా, చలి ఎక్కువగా ఉండటంతో ఇద్దరు బయటకు వచ్చారు. ఉత్తేజ్తోపాటు తాండూరుకు చెందిన శివదత్త నీటిలోకి దిగగా గల్లంతయ్యారు. శివదత్త మృతదేహం శనివారం దొరకగా, ఉత్తేజ్ మృతదేహం ఆదివారం రాత్రి లభించింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఉత్తేజ్ అనుకోని ఘటనలో చనిపోవడం అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.