ఇద్దరు నకిలీ మావోయిస్టులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల పేరుతో బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుడ్లపాడుకు చెందిన దాసరి శ్రీకాంత్, వరంగల్ కరీమాబాద్కు చెందిన బాలిని మహేశ్ ఇద్దరూ కొంతకాలంగా నకిలీ మావోయిస్టులుగా చలామణీ అవుతున్నారు. ఈ క్రమంలో భారత కమ్యూనిస్టు మావోయిస్ట్ పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ కమాండర్ దేవన్న పేరుతో నకిలీ లెటర్ ప్యాడ్ సృష్టించారు. రోగుల నుంచి అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని బెదిరిస్తూ హనుమకొండలోని అజరా హాస్పిటల్, దీపక్ స్కిన్ క్లినిక్ హాస్పిటల్, ఎన్ఎస్ఆర్ గ్రూప్ సంస్థ యాజమాన్యాలకు లేఖలు పంపించారు. తమకు డబ్బులు ఇవ్వాలని.. లేదంటే నక్సల్స్ చేతిలో చనిపోతారంటూ హెచ్చరించారు. దీంతో ఆయా యాజమాన్యాల ఫిర్యాదుతో హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. దర్యాప్తులో భాగంగా శ్రీకాంత్, మహేశ్ మావోయిస్టుల పేరు చెప్పుకుని ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి, వారి దగ్గర నుంచి నకిలీ లెటర్ ప్యాడ్, ఒక ద్విచక్రవాహనం, రెండు మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.