హనుమకొండ ఫిబ్రవరి 2 : టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్లో హనుమకొండ జిల్లా రాష్ట్రంలోనే రికార్డును సొంతం చేసుకుంది. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
15 నుంచి 17 సంవత్సరాల టీనేజర్ల కు 100 శాతం పైగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసి రాష్ట్రంలోనే తొలి జిల్లాగా రికార్డు సాధించినందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు.
జిల్లాలో 55 వేల 694 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యాన్ని అధిగమించి 56 వేల 291 మందికి (101%) వ్యాక్సిన్ వేశారు.
రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.