హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): టీనేజర్ల వ్యాక్సినేషన్లో హనుమకొండ జిల్లా రికార్డు సృష్టించింది. 15-18 ఏండ్ల మధ్య వయస్సున్న వారికి 101 శాతం మొదటి డోస్ పూర్తిచేసిన తొలి జిల్లాగా నిలిచింది. జిల్లాలో 55,694 మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా.. మంగళవారం నాటికి లక్ష్యానికి మించి 56,299 మందికి వేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా వైద్య సిబ్బందిని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. మిగతా జిల్లాలు ఇదే స్ఫూర్తితో వీలైనంత త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో 2,850 కరోనా కేసులు
రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 2,850 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 859, మేడ్చల్ మల్కాజిగిరిలో 173, రంగారెడ్డిలో 157, సిద్దిపేటలో 101 కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు 3.51 శాతం నుంచి 3.03 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసులు 35 వేలకు తగ్గాయి. కరోనా, ఇతర వ్యాధులతో ఇద్దరు మరణించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 2.10 లక్షల మందికి టీకాలు వేశారు. 44 వేల మందికి మొదటి డోస్, 1.59 లక్షల మందికి రెండో డోస్, 6,490 మందికి బూస్టర్ డోస్ వేశారు. రాష్ట్రంలో 14.49 లక్షల డోసులు, ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో 53,074 పడకలు అందుబాటులో ఉన్నాయి.