హుజురాబాద్: బీజేపీ విధానం రద్దు..రద్దు…రద్దు..ఆ పార్టీకి ఓటు వద్దు…వద్దు…వద్దు అనిహరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం వీణవంక మండలం కిష్టంపేటలోని పీఎస్ కల్యాణ మండపంలో చేనేత కార్మికుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎల్. రమణ, పెద్దిరెడ్డి పాడి కౌశిక్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ … “సంక్షేమాన్ని పంచే టీఆర్ఎస్ కావాలా..?ప్రజలపై భారం పెంచే బీజేపీ కావాలా..? అని అన్నారు. ” వీణవంక మండలంలో నాలుగు చేనేత సొసైటీలకు రూ. 2 కోట్ల 81 లక్షల 29 వేల 91 చెక్కులు ఇస్తున్నామని, త్రిఫ్ట్ ఫండ్ మళ్లీ ఇస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్ కు చెప్పగానే రూ. 30 కోట్లు విడుదల చేశారని చెప్పారు. “మీకు నచ్చినంత రూ. 800 లేదంటే రూ.1200 కట్టుకుంటే ప్రభుత్వమే రెండింతలు ఇస్తుంది.. దానికి ఆరు నెలల కోసం రూ. 30 కోట్లు కేటాయించామని, బిజెపి ప్రభుత్వం ఏమి ఇచ్చిందో.. ?టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చిందో…? ఆలోచించాలని” ఆయన పేర్కొన్నారు.
“బీజేపీ ఉన్న పథకాలు ఊడగొట్టి చేనేత కార్మికుల నోట్లో మట్టి కొట్టింది, చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం, ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డ్ ను కేంద్రం రద్దు చేసింది. 4 శాతం ఉన్న త్రిఫ్ట్ పథకాన్ని రద్దు చేసింది. ఢిల్లీవాళ్ళు 4 శాతం త్రిఫ్ట్ ఫండ్ ను రద్దు చేస్తే.. సీఎం కేసీఆర్ 16 శాతం త్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నారు. చేనేతకారుల బీమా పథకాన్ని రద్దు చేస్తే.. అలాంటి పథకాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని” అన్నారు.
“కేంద్రం రద్దు రద్దు అంటే.. మనం వాళ్ళను వద్దు వద్దు అనాలి, రద్దులు బీజేపీ ఇస్తే.. పద్దులు టిఆర్ఎస్ ఇచ్చింది, రద్దుల వైపు ఉంటారా.. పద్దుల వైపు ఉంటారా? మాయ మాటలు, మొసలి కన్నీరు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, బొట్టు బిళ్లల వైపు ఉందామా.. పని చేసే ప్రభుత్వం వైపు ఉంటారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.”చెప్పిన ప్రతి పనీ చేశాం, గతంలో 4 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే..ఒక్క ఇల్లు కట్టివ్వలేదు.. ఈ పాపానికి ఎవరు కారణమో అర్ధం చేసుకోవాలి, కొందరు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు.. 4 వేల ఇండ్లు కట్టి 10 వేల మందిని ఇండ్లలోకి పంపించడం ఆత్మగౌరవం కాదా..?
మీకు ఇండ్లు కట్టించే బాధ్యత నాది, చేనేత సొసైటీ భవనాల మరమ్మతులకు నిధుల మంజూరుకు కృషి చేస్తా, 50 ఏండ్లు కాంగ్రెస్, 20 ఏండ్లు పాలించిన టీడీపీ మన కోసం ఏం చేశాయి..? ఇవాళ ఎక్కడా ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాం, పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దాం, కాళేశ్వరం ప్రారంభించిన రోజు పూర్తవుతదా అన్నారు.. ఇవాళ మన పొలాల్లో గంగమ్మ గలగలా పారుతోంది, వీణవంకలో అడగగానే 24/7 ఆస్పత్రి మంజూరు చేశాం, పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి, భవిష్యత్ లో మీ కూలీ రేట్లు పెంచేందుకు కృషి చేస్తానని” హరీశ్ రావు అన్నారు.
“చేనేత కార్మికులు నష్టపోవద్దని బట్టలన్నీ ప్రభుత్వమే కొంటోంది, గతంలో ఈ పరిస్థితి ఉండేనా ఆలోచించాలి, ఇంకా రెండున్నరేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది.. పని చేసే ప్రభుత్వం వైపు ఉంటే మనకే మంచిది , ధరలు పెంచిన వాళ్లకు శిక్ష వేయాలా వద్దా..? పేదలను పట్టించుకున్న వాళ్ళను గెలిపిద్దామా..? భారం వేసిన వాళ్ళను గెలిపించుకుందామా..? పని చేసే సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని హరీశ్ రావు ప్రజలను కోరారు.