హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): చేనేత బీమా సొమ్మును వెంటనే విడుదల చేయాలని, పావలా వడ్డీ స్కీమ్ బకాయిలను చేనేత సహకార సంఘాలకు చెల్లించాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేసే దుస్తుల ఆర్డర్లను టెస్కోకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రాష్ట్ర చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్ను టెస్కో కార్యాలయంలో ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిఫ్ట్, నేతన్న భరోసా నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని సూచించారు. చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలని కోరారు.
వారసత్వ సభ్యత్వాలను పునరుద్ధరించాలని, అర్హత కలిగిన వారికి కొత్త సభ్యత్వాలు వెంటనే ఇవ్వాలని విన్నవించారు. కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని కోరారు. మార్కెట్లో పట్టు దారం ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో అందుకనుగుణంగా ప్రభుత్వం చెల్లింపులు చేయాలని విజ్ఞప్తిచేశారు. 60 ఏండ్లు దాటి మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు రావాల్సిన బీమా సొమ్మును తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన శైలజరామయ్యర్ త్వరలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారని ఎల్ రమణ తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.