ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నది. 5,784 మంది రజకులకు రూ.31.26 లక్షల రుణాలు అందజేసింది. రూ.29.45 కోట్లతో 644 చోట్ల నూతన దోబీఘాట్లను నిర్మించింది. 8 చోట్ల రూ.2.12 కోట్లతో ఆధునిక లాండ్రీలు ఏర్పాటు చేసింది. రజక ఫెడరేషన్ ద్వారా కారు లోన్లు ఇస్తున్నది.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ.. ఆది నుంచీ సబ్బండ వర్ణాల సమాహారం.. ఇక్కడ కులాలున్నా.. వాటిలోనే కల్మషంలేని జీవితాలూ ఉంటాయి. వర్గాలున్నా.. ఊరుమ్మడి ఉత్సవాలుంటాయి. అద్భుత సమ్మిళిత జీవనానికి తెలంగాణ జీవనాడి.. కానీ, దాదాపు 60 ఏండ్లు సాగిన వలసవాద వివక్షాపూరిత పాలనలో ఆ జీవం క్షీణించిపోయింది. కులవృత్తులు కునారిల్లి.. గొప్పగొప్ప వృత్తి నిపుణులు కూడా కూలీలయ్యారు. ముఖ్యంగా బీసీల్లోని కులవృత్తులే ఆధారంగా జీవించినవారు ఆకలిచావులకు కూడా బలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే మళ్లీ కులవృత్తులకు, బీసీ సమాజానికి మంచిరోజులొచ్చాయి. తెలంగాణ ఆత్మ తెలిసిన నాయకుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్గాలు పూర్వవైభవం దిశగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచి దేశానికి తెలంగాణను రోల్ మాడల్గా నిలుపుతున్నది.
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇప్పటికే చేతినిండా పని ఉండేలా చర్యలు తీసుకొన్న సర్కార్.. నేతన్నలకు బీమా తెచ్చి వారి కుటుంబాలకు భరోసా కల్పించింది. రైతుబీమా తరహాలో దాదాపు 80 వేల మందికి బీమా తీసుకొచ్చి వారికి ధీమానిచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చొరవతో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపును కల్పించింది. ఇప్పటికే 60 వేల మంది వివరాలతో జియోట్యాగింగ్ ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. వీరిలో 22 వేల చేనేత కార్మికులు, 24 వేల మంది చేనేత అనుబంధ కార్మికులతోపాటు 15 వేల మంది పవర్లూమ్ కార్మికులు ఉన్నారు. చేనేత రంగంపై పరోక్షంగా ఆధారపడిన కార్మికులు సుమారు 20 వేల వరకు ఉన్నట్టు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి.
నేత కార్మికులకు అందుతున్న వివిధ పథకాలు
సెలూన్లకు ఉచిత విద్యుత్తు
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాయీబ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నది. 2.5 లక్షల నాయీబ్రాహ్మణ కుటుంబాలకు మేలు జరుగుతున్నది. నాయీ బ్రాహ్మణ యువతకు బ్యూటీషియన్ తదితర కోర్సుల్లో వృత్తి నైపుణ్య శిక్షణను అందిస్తున్నది.
కుండల తయారీలో నైపుణ్య శిక్షణ
సనాతన పద్ధతుల్లో మట్టి పాత్రలు తయారుచేసే కుమ్మరి/శాలివాహన వృత్తిదారులకు ప్రభుత్వం అత్యాధునిక నైపుణ్యాలు నేర్పిస్తున్నది. భూదాన్ పోచంపల్లిలోని రామానందతీర్థ ఇన్స్టిట్యూట్లో 350 మంది కుమ్మరి వృత్తిదారులకు మట్టిపాత్రల తయారీలో శిక్షణ ఇప్పించారు. వారి ద్వారా మరో 4 వేల మందికి శిక్షణ ఇచ్చారు. దీంతో వీరంతా మట్టి గణపతులు, దీపంతలు, మట్టి గ్లాసులు, జగ్గులు, వాటర్ బాటిల్స్ తదితర మట్టిపాత్రల తయారీలో నిష్ణాతులయ్యారు. కుమ్మరి వృత్తికళాకారుల జీవన ప్రమాణాలు పెంచటంతోపాటు ప్రభుత్వం మా డ్రన్ పాటరీ కిట్లను 80 శాతం సబ్సిడీపై అందించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట మండలాలకు ప్రత్యేకం గా మండలానికి ఒకటి చొప్పున ఆధునిక కుం డల బట్టీలను మంజూరు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేశవరం గ్రామంలో కుమ్మరి వృత్తిదారుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని త్వర లో ప్రారంభించేందుకు సన్నాహా లు చేస్తున్నది.
సంచారజాతులకు ఆపన్న హస్తం
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లలో ఏ ప్రభుత్వమూ సంచార జాతుల సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. కొన్ని కులాలను కనీసం గుర్తించనూ లేదు. ఫలితంగా కుల సర్టిఫికెట్లు రాక, విద్యా, ఉపాధి అవకాశాలు పొందలేక నానా అవస్థలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో వారి కష్టాలు తీరాయి. విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఎంబీసీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ- ఆటో రిక్షా పథకాన్ని ప్రవేశపెట్టింది. 60 శాతం సబ్సిడీతో ఈ -ఆటోలను అందిస్తున్నది. ఒక్కో యూనిట్ విలువ రూ.3,22,910 కాగా, ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.1,93,746 ఇస్తుండగా, లబ్ధిదారులు తమ వాటాగా రూ.15 వేలు చెల్లిస్తే, బ్యాంకు రుణం కింద రూ.1,14,164 అందిస్తున్నది. ఈ పథకానికి ఇప్పటికే 500 మంది దరఖాస్తు చేసుకోగా, తొలిదఫాగా ఇటీవలే 36 మందికి అందజేసింది.
గొల్లకురుమలను బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనల నుంచి పుట్టిన కార్యక్రమం గొర్రెల పంపిణీ. రూ.11 వేలకోట్లతో 7.5 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 4 లక్షలకు పైగా యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
త్రిపుర నిపుణులతో వెదురులో శిక్షణ
మేదర కులస్థులను ఇతర రాష్ర్టాలకు తీసుకెళ్లి వెదురుతో తయారుచేసే వస్తువులు, తయారీ పద్ధతులపై అవగాహన కల్పించింది. త్రిపుర నుంచి నిపుణులను తీసుకొచ్చి విడతలవారీగా మేదరి వృత్తిదారులకు వెదురుతో గృహాలంకరణ వస్తువుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. చారిత్రక నిర్మాణాలు, కార్లు, బస్సులు, ఫ్లవర్వాజ్లు, ఫొటో ఫ్రేమ్లు.. ఇలా మొత్తంగా 150 రకాల వస్తువుల తయారీని నేర్పించి నైపుణ్యాలు పెంపొందించింది. వెదురు ఉత్పత్తులకు సంబంధించి అమన్గల్లులో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
గీతకార్మికులకు బాసట
ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల ఎక్స్గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. పాక్షిక వైకల్యం పొందిన వారికి రూ.2లక్షలు, పూర్తి వైకల్యం పొందితే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నది. గీత వృత్తి నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందితే దహన సంస్కారాలకు రూ. 25 వేల తక్షణ సహాయం, గాయపడితే రూ.15 వేల సాయాన్ని అందిస్తున్నది. ఇప్పటివరకు 312 గౌడకుటుంబాలకు రూ.68 లక్షలకు పైగా అందించింది. గౌడ కులస్తులకు మద్యం దుకాణాల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్ కల్పించింది.
విశ్వబ్రాహ్మణులకు మహర్దశ
ఉమ్మడి పాలనలో వృత్తికి దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశ్వబ్రాహ్మణ కళాకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర బీసీ ఫెడరేషన్ (విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్) ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రెండేండ్లుగా నిర్వహిస్తున్నది. డై మేకింగ్, వాక్సింగ్ మోల్డ్ తయారీ, స్టోనింగ్ తదితర అంశాల్లో ఆధునిక యంత్రాలపై శిక్షణ ఇప్పిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వందల మందికి పైగా శిక్షణ పొందారు. యంత్ర పరికరాలను కూడా సబ్సిడీపై అందిస్తున్నది.
విద్యారంగంలో..
బీసీల విద్యాభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో 12 మాత్రమే ఉన్న బీసీ గురుకుల పాఠశాలలను తెలంగాణ రాష్ట్రంలో 310కి పెంచింది. వీటిల్లో ఏటా 1.50 లక్షల మందికి పైగా బీసీ విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నది. 16 డిగ్రీ గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసింది. గురుకులాల నిర్వహణకు ఏటా రూ.650 కోట్లకు పైగా వెచ్చిస్తున్నది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే బీసీ యువతకు ఇతర రాష్ర్టాలు రుణాల కింద నిధులను ఇస్తుండగా, తెలంగాణ సర్కారు మాత్రం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద దాదాపు రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఇప్పటివరకు రూ.330 కోట్లను వెచ్చించి వెయ్యి మందికిపైగా బీసీ విద్యార్థులకు చేయూత అందించింది.