హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలో కూరగాయల సాగు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉన్నది. గడచిన పదిహేడేండ్లలో 30.07 లక్షల ఎకరాల సాగు మాత్రమే పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐకార్) ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్-వారణాసి విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. నివేదికలో 1951 నుంచి 2018 వరకు కూరగాయల సాగు, ఉత్పత్తి వివరాలను పొందుపరిచింది. నివేదిక ప్రకారం దేశంలో 2001లో 70.23 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగు కాగా, 2018లో అది కోటీ 30 లక్షల ఎకరాలకు పెరిగింది. 2001 నుంచి 2011 వరకు 10.27 లక్షల ఎకరాలు మాత్రమే పెరగడం గమనార్హం. సాగు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడింది. ఉత్పత్తి కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యాన శాఖ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2001లో 10.11 కోట్ల టన్నుల కూరగాయలు ఉత్పత్తి కాగా, 2018లో 18.74 కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగకపోవడంతో ఆ ప్రభావం వినియోగదారులపై పడుతున్నది. తలసరి లభ్యత తక్కువ మొత్తంలో పెరిగింది. 2001లో తలసరి లభ్యత ప్రతి రోజూ 189 గ్రాములు ఉండగా, 2018లో 261 గ్రాములకు పెరిగింది. ఇక దేశంలో కూరగాయల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఏటా 2.862 కోట్ల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో 2.813 కోట్ల టన్నులు, మధ్యప్రదేశ్లో 1.814 కోట్ల టన్నులు, బీహార్లో 1.597 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి.
చైనా ఫస్ట్
ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం కూరగాయాల్లో చైనాలోనే 46.72 శాతం పండిస్తుండటం గమనార్హం. ఇండియాలో 14.47 శాతం ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా 3.48 శాతం, టర్కీ 2.25 శాతం, ఈజిప్ట్ 1.93 శాతం, ఇరాన్ 1.85 శాతం, ఇతర దేశాలు 23.95 శాతం కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నాయి.
10 ఏండ్లు…126 రకాలు
కూరగాయల ఉత్పత్తి పెంచడంతోపాటు నూతన రకాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు భారత కూరగాయల పరిశోధన సంస్థ గడిచిన పదేండ్లలో 126 కొత్త కూరగాయ రకాలను అభివృద్ధి చేసినట్టు నివేదికలో వెల్లడించారు. ఇందులో 50 హైబ్రిడ్ రకాలు కావడం గమనార్హం. దేశంలో 28 కూరగాయ పంటల్లో 526 రకాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడెక్కడ ఏ రకం పంటకు అనుకూలంగా కూడా సూచించింది.