Telangana | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వేసవి తీవ్రత పెరుగుతున్నకొద్దీ విద్యుత్తు అవసరాలు కూడా భారీస్థాయిలో పెరుగుతున్నాయి. సగం కరెంట్ను ఇతర రాష్ర్టాల నుంచే కొనుగోలు చేయాల్సి వస్తున్నది. తాజా పరిస్థితుల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 290 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతున్నది. దీంట్లో సగం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుండగా, 140- 150 మిలియన్ యూనిట్లను ఇతర రాష్ర్టాల నుంచి కొనాల్సి వస్తున్నది. ఈ ఏడాది జనవరి 30న 111.891 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేశారు. ఇటీవలీ కాలంలో ఇదే అతి తక్కువ. ఆ తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కొనుగోలుచేయాల్సిన విద్యుత్తు రోజుకు 140 మిలియన్ యూనిట్లు దాటుతున్నది. మార్చి 26న అత్యధికంగా 151 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది.
రాష్ట్రంలో విద్యుత్తు సమస్యల తీరాలన్నా.. ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసే పరిస్థితులు మారాలన్నా యాదాద్రి విద్యుత్తు ప్లాంటు అందుబాటులోకి రావాలి. నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్లో ఇప్పటికే 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ట్రయల్న్క్రు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నల్లగొండ జిల్లా మంత్రులు ఈ ప్లాంట్ను సందర్శించారు. జూన్ లేదా జూలైలో రెండు యూనిట్లు ప్రారంభించే అవకాశముంది. మిగతా మూడు యూనిట్ల నిర్మాణం పూర్తయ్యి వినియోగంలోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్తు రంగంలో సాధికారత సాధించవచ్చని అధికారులంటున్నారు.