హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లా షేక్పేట్ మండలం హకీంపేటలోని 8.24 ఎకరాల భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ భూముల సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్లను నియమించింది. అడ్వకేట్ కమిషనర్ల నుంచి సర్వే నివేదిక అందే వరకు వేలం ప్రక్రియను వాయిదా వేయాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. హకీంపేట సర్వే నంబర్లు 102/2, 102/3లోని భూములను వేలం వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను సవాలు చేస్తూ పలు హౌసింగ్ సొసైటీలు, వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ భూమి పేరిట సొసైటీలు, వ్యక్తులకు చెందిన భూములను కూడా వేలం వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. భూములపై సంయుక్త సర్వే నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేట్ భూముల హద్దులను గుర్తించాలని గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు ఆ పని చేయలేదని తెలిపారు. సరిహద్దు వివాదం పరిషారం కాకముందే వేలం నిర్వహిస్తే సమస్య మరింత జఠిలం అవుతుందని ఆందోళన వ్యక్త చేశారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే వేలం నోటిఫికేషన్ అమలును నిలిపివేయాలని కోరారు. వేలం నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మే 26, 27, 29 తేదీల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించిప్పటికీ ఫలితం లేదన్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది మురళీధర్రెడ్డి ప్రతివాదన చేస్తూ.. ఆ సర్వే నంబర్ల పరిధిలో సుమారు 323 ఎకరాల భూములు ఉన్నాయని, వాటిలో కొంత పట్టా భూమి, మరో 43 ఎకరాలు అసైనీలకు కేటాయించిన భూమి ఉన్నదని వివరించారు. పేదల ఆక్రమణలు, హౌసింగ్ సొసైటీలకు చెందిన స్థలాలను మినహాయించి ప్రభుత్వ భూమికి కంచె వేసినట్టు తెలిపారు. ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూమినే వేలం వేయనున్నామన్నారు. దీంతో ప్రభుత్వం కంచె వేసిన భూమిని జూలై 4న క్షేత్ర స్థాయిలో సర్వే చేయాలని జస్టిస్ ఏవీ శ్రవణ్కుమార్ అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రభుత్వం తరఫున ఏ శ్రీధర్రెడ్డిని, పిటిషనర్ల తరఫున శ్యామేశ్ అగర్వాల్ను అడ్వకేట్ కమిషనర్లుగా నియమించారు. ఇరుపక్షాల సమక్షంలో సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని అడ్వకేట్ కమిషనర్లను ఆదేశించారు. వారి నుంచి నివేదిక వచ్చే వరకు భూముల వేలాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి, తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.