TS Weather | తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో వానలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల వడగండ్లు పడడంతో రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతున్నది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడురోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే సూచనలున్నాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం నుంచి మంగళవారం వరకు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వానలు పడుతాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నెల 20 నుంచి 21 ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఓ వైపు ఎండలతో జనం అల్లాడుతుండగా.. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై చల్లగా మారడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో వైపు అకాల వర్షాలకు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. పలుచోట్ల మామిడి, జామకాయలు నేలరాలుతున్నాయి. మక్క, జొన్న పంటలు దెబ్బతింటున్నాయి.