హైదరాబాద్, మార్చి 14 : రాష్ట్రంలో మూడు రాజ్యాంగ పదవులను నడిపిస్తున్నది రైతు బిడ్డలేనని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం శాసనమండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలిలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్రావు, స్పీకర్గా పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి.. ఈ ముగ్గురూ రైతులు, రైతు బిడ్డలు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలోని రైతుల ప్రతినిధులుగా చట్టసభలను, ప్రభుత్వాన్ని నిర్వహించటం తెలంగాణ అదృష్టమని కొనియాడారు. గుత్తా సుఖేందర్రెడ్డి తన 41 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా అనేక హోదాల్లో పనిచేసి ప్రజాసేవలో నిమగ్నమైన గొప్ప నాయకుడు అని శ్లాఘించారు. 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, రైతు సమన్వయ సమితి రాష్ట్ర తొలి చైర్మన్గా, రెండోసారి మండలి చైర్మన్గా.. ఇలా ఏ పదవిని చేపట్టినా ఆ పదవికి గౌరవాన్ని తెచ్చిన వ్యక్తిగా గుత్తా సుఖేందర్రెడ్డి పేరు తెచ్చుకొన్నారని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు బంధు సమితికి తొలి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్రెడ్డి వ్యవహరించారని గుర్తు చేశారు.
ఎస్సారెస్పీ కట్ట మీద కలలుగన్న స్వప్నం
‘ముఖ్యమంత్రి కేసీఆర్ 1996లో రవాణాశాఖ మంత్రిగా ఉన్నపుడు నిర్మల్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు వస్తే టీడీపీ అభ్యర్థి నల్లా ఇంద్రకరణ్రెడ్డి గెలుపు కోసం మీరు (గుత్తా సుఖేందర్రెడ్డి), కేసీఆర్ ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఎస్సారెస్పీ కట్టను చూసి బాధపడ్డారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టును చూసి అన్నా.. మన ప్రాజెక్టులు శైవాలయాలుగా, ఆంధ్రా ప్రాజెక్టులు వైష్ణవాలయాలుగా ఉన్నాయని మీరంటే, అన్నా.. ఏదో ఒక సమయంలో తెలంగాణ వస్తది, తెలంగాణ వస్తే తప్ప వీటికి శాశ్వత పరిష్కారం దొరకదని కేసీఆర్ మీతో అన్నారట. సీఎం కేసీఆర్ ఇప్పటికీ మాకు చెప్తుంటారు’ అని కేటీఆర్ గుర్తుచేశారు. రైతుబిడ్డలుగా స్వప్నించిన తెలంగాణ సాకారమై, సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశానికే మార్గదర్శనం చేసే స్థాయికి చేరిందని, అందులో భాగస్వామ్యం కావటం గొప్ప విషయమని తెలిపారు. దేశంలో రైతుల కష్టాలు తీర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శ్వేతవిప్లవం వచ్చిందని వెల్లడించారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే నక్కలగండి-డిండి ప్రాజెక్టును పూర్తి చేయటమే ఏకైక మార్గమని 2009లోనే గుత్తా సుఖేందర్రెడ్డి ఇరిగేషన్ ఇంజనీర్గా చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక తాను గ్రామీణ మంచి నీటి సరఫరాశాఖమంత్రిగా మిషన్ భగీరథ ఫైలాన్ను చౌటుప్పల్లో వేశానని అన్నారు. మిషన్ భగీరథ ఫలితంగా రాష్ట్రంలో ఒక్క ఫ్లోరోసిస్ గ్రామం కూడా లేదని తేల్చిచెప్పారు.
గుత్తాకు అభినందనల వెల్లువ
శాసనమండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డిని మంత్రులు అభినందించారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గుత్తా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఉద్యమానికి సహకరించారని, అనేక బహిరంగ సభల మీద తెలంగాణ వాణిని వినిపించారని వెల్లడించారు. మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తాము ఢిల్లీకి వెళ్తే 45 రోజుల పాటు గుత్తా ఆశ్రయం కల్పించారని గుర్తుచేశారు. గుత్తా సుఖేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపినవారిలో.. మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతిరాథోడ్, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీలు వాణీదేవి, జీవన్రెడ్డి, సయ్యద్ అమినుల్ హసన్ జా ఫ్రీ, కాటేపల్లి జనార్దన్, నర్సిరెడ్డి, కడియం శ్రీహరి, మ ధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగాధర్గౌడ్, బండ ప్రకాశ్, ఎల్ రమణ తదితరులు ఉన్నారు.
పార్టీ వేరైనా.. తెలంగాణ కోసం
‘తెలంగాణ సాధనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు 2008లో 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జిగా తనను కేసీఆర్ పంపారు. అందరూ గుత్తా సుఖేందర్రెడ్డి ఆశీస్సులు తీసుకోవాలని కోరారు. అప్పుడు తాను కోరగానే తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ గెలుపు కోసం ఉప్పల్లో నిర్వహించిన సభకు గుత్తా సుఖేందర్రెడ్డి స్వయంగా హాజరై మద్దతు పలికారని గుర్తుచేశారు.
మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా
రాష్ట్ర శాసనమండలి చైర్మన్గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శాసనమండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 9 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ వెల్లడించారు. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, కడియం శ్రీహరి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, బీ గంగాధర్గౌడ్, ఎంఐఎం మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ తదితరులు గుత్తా సుఖేందర్రెడ్డి చైర్మన్ అభ్యర్థితాన్ని బలపరస్తూ నామినేషన్లు దాఖలు చేశారని, ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్టు జాఫ్రీ ఉదయం 11 గంటలకు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, అబ్కారీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి.. గుత్తా సుఖేందర్రెడ్డిని తోడ్కొని వెళ్లి చైర్మన్ ప్రొటెం అమినుల్ హసన్ జాఫ్రీ సమక్షంలో చైర్మన్ స్థానంలో కూర్చొబెట్టారు.
ఎగువసభ గౌరవాన్ని నిలబెడతా
ఎగువ సభ గౌరవాన్ని నిలబెడతా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చట్టసభలు అత్యున్నతంగా, హుందాగా జరుగుతున్నాయి. సభలకు గౌరవం పెరిగింది. సభ నిర్వహణలో హుందాగా వ్యవహరించటమే కాకుండా సీఎం కేసీఆర్ కల్పించిన గౌరవాన్ని హుందాగా కాపాడుతా. సభ్యుల హక్కులు పరిరక్షిస్తా. ప్రజా సమస్యల పరిష్కారంలో సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా అందరి సహకారం తీసుకొంటా. – మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
12,769 పంచాయతీల్లోని వార్డు సభ్యులకు స్ఫూర్తి
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లోని వార్డు మెంబర్లకు గుత్తా సుఖేందర్రెడ్డి స్ఫూర్తిగా నిలిచారు. వార్డు మెంబర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకొంటే ఏ స్థాయికైనా వెళ్లగలమని ఆయన నిరూపించారు.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత