నల్లగొండ, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. శనివారం నల్లగొండలో మీడియాతో గుత్తా చిట్చాట్ చేస్తూ పలు విషయాలపై మాట్లాడారు.
రాజకీయాల్లో విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. కానీ.. కొందరు అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లాంటి వాళ్లు రాజకీయాల్లో విపరీత భాషను వాడుతున్నారని, అది మంచిది కాదని హితవు పలికారు. మంత్రి జగదీశ్రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అంతా తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పారు.